రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించి చంద్రబాబు నాయుడుకు ఎన్నికల ముందు పెద్ద తలనొప్పిని తెచ్చి పెట్టాడు.ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు వర్మ అది కూడా ఎన్నికల ముందు తీసుకు వస్తున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నాయకులు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
వర్మ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎన్నికలపై ఉంటుందని తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు.అందుకే సినిమాను ఎన్నికలు పూర్తి అయ్యే వరకు నిలిపేయాలని ఈసీని టీడీపీ నాయకులు కోరడం జరిగింది.
అయితే ఈసీ అందుకు అంగీకరించక పోవడంతో వర్మను కొనుగోలు చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించారట.
ఈ విషయాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర నిర్మాత రాకేష్ అంటున్నాడు.ఈ చిత్రంను విడుదల కాకుండా అడ్డుకుంటే వర్మకు 50 కోట్లు ఇస్తామని టీడీపీ వారి నుండి ఆఫర్ వచ్చిందని, అయితే వర్మ అలా డబ్బుకు అమ్ముడు పోయే వ్యక్తి కాదని, తాను అనుకున్నట్లుగా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడు అని రాకేష్ చెప్పుకొచ్చాడు.సినీ నిర్మాత రాకేష్ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా తెగ చర్చ జరుగుతున్నాయి.
టీడీపీ వారు నిజంగానే వర్మకు అంత భారీ అమౌంట్ను ఆఫర్ చేశారా అంటూ ప్రచారం జరుగుతుంది.
వర్మ తనకు టీడీపీ వారు అమౌంట్ ఆఫర్ చేస్తే స్వయంగా ఆయనే చెప్పేవాడు.తనను కొనుగోలు చేసేందుకు టీడీపీ వారు ప్రయత్నించారు అంటూ ఆయన ముందుగానే ప్రకటించే వాడు.కాని రాకేష్ ఈ విషయాన్ని చెబుతున్న కారణంగా ఇది రాజకీయ ఆరోపణలు అయ్యి ఉంటాయి అంటున్నారు.
ఈ చిత్ర నిర్మాత రాకేష్ వైకాపా లీడర్ అనే విషయం తెల్సిందే.వైకాపా నాయకుడు అవ్వడం వల్ల టీడీపీ వారిని ఇరుకున పెట్టే ఉద్దేశ్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడు అని కొందరు అంటున్నారు.
ఈ విషయంలో వర్మ నోరు తెరిస్తే తప్ప నిర్మాత మాటలు నమ్మలేం.