తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రతి పార్టీ ప్రయత్నిస్తోంది.ఏ ఎండకి ఆ గొడుగు అన్న విధంగా ఓటర్లను మభ్యపెడుతూ … ఓట్లు రాబట్టుకునేందుకు పార్టీలు చూస్తున్నాయి.
తాజాగా కేటీఆర్ ఓ కార్యక్రమంలో పాల్గొని కీలక వాక్యాలు చేసి తెలంగాణాలో ఉన్న సెటిలర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.అమరావతి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు ఇవ్వాలని అనుకున్నారని, కానీ ప్రధాని మోడీ కారణంగా ఆగిపోవాల్సి వచ్చిందని కేటీఆర్ తెలిపారు.వాస్తవానికి వేదికపై నుంచే… అమరావతి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.100 కోట్లు ప్రకటించాలని కేసీఆర్ అనుకున్నారట.ప్రధాని నరేంద్ర మోడీ చెంబు నీళ్లు, తట్టెడు మట్టి ఇవ్వడంతో కేసీఆర్ సైలెంట్ అయిపోయారట.
ప్రధాని మోడీ అహం దెబ్బతింటుందనే భావనతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
అమరావతికి ప్రధాని ఏదో ప్రకటిస్తారని అనుకుంటే.ఆయన ఏమీ ప్రకటించకపోవడం ఆశ్చర్యాన్ని కలగజేసిందని కేసీఆర్ చెప్పారని కేటీఆర్ తెలిపారు.కాంగ్రెస్, బీజేపీలది ఒకటే వైఖరని.
ఈ పార్టీల బాస్లు ఢిల్లీలో ఉంటారని.ముఖ్యమంత్రులన్నా వారికి చిన్న చూపేనని.
ప్రజల ఆంకాంక్షలను పట్టించుకోరని కేటీఆర్ మండిపడ్డారు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇరు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేశాయని కేటీఆర్ ఆరోపించారు.
రాజధాని శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన వేదికపైకి కేసీఆర్ వెళ్లగానే అక్కడున్న ఏపీ ప్రజలంతా హర్షధ్వానాలు చేశారని కేటీఆర్ చెప్పారు.ప్రజల్లో విభేదాలు లేవు, తెలుగువారంతా ఒకటే అనేదే ప్రజల భావన అనే విషయం తమకు అప్పుడే అర్థమయిందని తెలిపారు.
ఏపీ మీద, సీమాంధ్ర ప్రజల మీద కేటీఆర్ ఈ విధంగా ప్రేమ కురిపించడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.ఏపీ రాజధాని గురించి, ఏపీకి కాంగ్రెస్, బీజేపీలు చేసిన అన్యాయం గురించి కేటీఆర్ ప్రస్తావించడం సెటిలర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నట్టు అర్ధం అవుతోంది.తెలంగాణాలో నివసిస్తున్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు తాను అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఈ నాలుగేళ్ల ఆచరణ ఆంధ్ర ప్రజల ముందు ఉందని, వారికి ఇంకా ఏమైనా అనుమానాలుంటే వారందరికీ సోదరిగా, వారిలో ఒకడిగా, కేసీఆర్ కుమారుడిగా, టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా వ్యక్తిగతంగా అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఆదివారం హైదరాబాద్ నిజాంపేటలో జరిగిన ‘మన హైదరాబాద్ – మనందరి హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.