ఈ ఎన్నికల్లో విజయం తమనే వరించబోతోంది అన్న ధీమాలో ఉన్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జనసేన పార్టీ కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది.జనసేన గెలిచే సీట్లు అంతంతమాత్రంగానే ఉన్నా ఆ పార్టీ ప్రభావం , ఆ పార్టీ చీల్చే ఓట్లు తమ కొంప ముంచడం ఖాయం అనే ఆందోళనలో వైసీపీ ఉంది.
ముఖ్యంగా ఏపీలో అధికారం దక్కించుకోవడానికి కీలకమైన గోదావరి జిల్లాల్లో విజేత ఎవరు అనేది ముందు తేలాల్సి ఉంది.ఇక్కడి ఫలితాలను బట్టే అధికారం ఏ పార్టీకైనా వారించే సంప్రదాయం కొనసాగుతోంది.
గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు ఈ సారి దక్కించుకోకపోతే అధికారం అందని ద్రాక్షే అవుతుందని వైసీపీ భయపడుతోంది.
ముఖ్యంగా నరసాపురం ఎంపీ సీటుకు జనసేన ఎసరు పెట్టిందనే వార్తలు ఇప్పుడు వైసీపీని కలవరం పెట్టిస్తున్నాయి.
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అంతా అడిగే ప్రశ్న గోదావరి జిల్లాల్లో పరిస్ధితి ఏమిటి ? గోదావరి జిల్లాలను గెలిచే పార్టీ ఏది ? అన్నదే.అంతెందుకు గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో దాదాపు స్వీప్ చేసిన తెలుగుదేశం అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది.
టీడీపీ విజయానికి గోదావరి జిల్లాలు అండగా నిలవడం దశాబ్దం తర్వాత ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యింది.ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత కూడా గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్ధానాల్లో ఆధిక్యం కోసం పార్టీలు చేయని ఫీట్లు లేవు.
అలాంటిది ఈసారి గోదావరి జిల్లాల్లో ఓటరు నాడి ఎటువైపు ఉందన్నది టీడీపీ, వైసీపీలకు అంతుచిక్కడంలేదు.
ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన జనసేన పార్టీ ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్ని ఓట్లు చీల్చిందనే దానిపైనే పార్టీల విజయం ఆధారపడి ఉంది.ఏపీలో వైసీపీ అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలన్నీ చెబుతున్నా ఆ పార్టీలో మాత్రం లోలోపల తెలియని ఆందోళన మాత్రం బాగా కనిపిస్తోంది.దీనికి కారణం రాష్ట్రమంతటా ఫ్యాను గాలి వీచినా కాపు సామాజికవర్గం జనసేనకు అండగా నిలిచిన గోదావరి జిల్లాల్లో మాత్రం పరిస్ధితి ఏమిటన్నది స్పష్టంగా తెలియడంలేదు.
నరసాపురం ఎంపీ సెగ్మెంట్ తో పాటు గోదావరి జిల్లాల్లోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లోనూ జనసేనకు గెలుపు అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వైసీపీలో ఆందోళన కలిగిస్తున్నాయి.