ఫోన్ ట్యాపింగ్ అనే అస్త్రాన్ని అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.గతంలో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఫోన్ టాపింగ్ ద్వారానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇరుక్కున్నాడు.
ఆ కేసులో చంద్రబాబు ఫోన్లో మాట్లాడుతూ… నామినేటెడ్ ఎమ్మెల్యేను స్టీఫెన్ సన్ ను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని కేసు కూడా నమోదయింది.అయితే అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతూ వస్తోంది.
ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమయం కూడా దగ్గర్లో ఉండడంతో ఈ కేసు మరింత స్పీడ్ అయ్యింది.ఓటుకు నోటు ఎఫెక్ట్ కారణంగానే అకస్మాత్తుగా ఏపీ రాజధానిని అమరావతికి మార్చేయాల్సి వచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ ముందస్తు ఎన్నికల సందర్భంగా కూడా మరోసారి ప్రస్తావనకు వచ్చింది.
మహాకూటమిలో ఉన్న నాయకుల ఫోన్లను అధికార పార్టీ టిఆర్ఎస్ ట్యాపింగ్ చేయిస్తోంది అంటూ… అప్పట్లో మహా కూటమి నాయకులు ఉత్తంకుమార్ రెడ్డి, చాడ వెంకటరెడ్డి, కోదండరాం తదితరులు ఆరోపిస్తూ… ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.ఇక ఆ సంగతి అలా ఉంచితే… ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు రావడంతో ఇదే అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది.అధికార పార్టీ టిడిపి తమ ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా ఏర్పాటు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.
భద్రతాపరమైన అంశాలకు ఉపయోగించాల్సిన ట్యాపింగ్ అస్త్రాన్ని రాజకీయ ప్రత్యర్థుల మీద ఉపయోగించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ ప్రత్యర్థుల తో పాటు ఏపీ లో పనిచేస్తున్న కీలకమైన అధికారుల ఫోన్లను ప్రభుత్వం రహస్యంగా వింటోందని… దీని కోసం ఒక ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశారని కథనాలు వస్తున్నాయి.ముఖ్యంగా … ఏపీ ఇంటిలిజెన్స్ విభాగంలో మొత్తం టీడీపీకి అనుకూలంగా ఉన్న వారిని ఏర్పాటు చేసుకుని… ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనుభవం అన్న కొంతమంది అధికారులను ఉపయోగించుకుని ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని ప్రభుత్వం తెలుసుకుంటోంది అంటూ ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్యంగా కీలక విభాగాలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారుల ఫోన్ లు మొత్తం ట్యాపింగ్ అవుతున్నాయని తెలుస్తోంది.దీన్ని ఆధారంగా చేసుకొని కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, ఇంకా కొంతమంది కీలక అధికారులను కీలక విభాగాల నుంచి తప్పించి తమకు అనుకూలమైన అధికారులను వారి ప్లేస్ లో నియమించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.