మన పాలకులకు, దేశ ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం ఏమిటంటే…ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని.అతను పాక్లోనే ఉంటున్నాడని, అతనికి తామే ఆశ్రయం కల్పిస్తున్నామని పాకిస్తాన్ పాలకులకూ, ప్రజలకూ తెలుసు.
అయినా ‘దావూద్ మా దేశంలో లేనేలేడు’ అని పాక్ పాలకులు ఇప్పటికీ బుకాయిస్తూనే ఉన్నారు.దావూద్ పాక్లోనే ఉన్నాడని చెప్పడానికి ప్రత్యేకంగా సాక్ష్యాలు ఏమీ అక్కర్లేదు కూడా.
అయితే ‘దావూద్ పాక్లోనే ఉన్నాడు’ అని ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ‘ది హిందుస్తాన్ టైమ్్స’ వార్త ప్రచురించింది.దీంతో కేంద్ర ప్రభుత్వం పాక్పై రెచ్చిపోయింది.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ‘తిరుగులేని సాక్ష్యం దొరికింది’ అని వ్యాఖ్యానించారు.దావూద్ తమ దేశంలో లేడని పాక్ ఖండిస్తూవస్తోందని, ఇప్పుడు తిరుగులని సాక్ష్యం దొరికింది కాబట్టి అతని భారత్కు అప్పగించాలని వెంకయ్య పాక్ను డిమాండ్ చేశారు.
అయితే హిందుస్తాన్ టైమ్్స కథనానికి భాజపా మిత్రపక్షమైన శివసేన ప్రాధాన్యం ఇవ్వలేదు.దావూద్ పాక్లోనే ఉన్నాడని అందరికీ తెలుసునని, ఇందులో కొత్త విషయం ఏముందని ప్రశ్నించింది.
తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా దావూద్ పాక్లో ఉన్నట్లు సమాచారం ఉందని, ఈ విషయం ఇప్పుడు కొత్తగా చెప్పేదేముందని కాంగ్రెసు నాయకుడు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు.అమెరికా ఒసామా బిన్ లాడెన్ను వదిలిపెట్టట్లుగానే భారత్ కూడా దావూద్ ఇబ్రహీంను వదలిపెట్టకూడదని మరో కాంగ్రెసు నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ అన్నారు.
దావూద్ను వదలిపెట్టకూడదనే అభిప్రాయం బాగానే ఉన్నా, పాక్ అతన్ని భారత్కు అప్పగిస్తుందని అనుకోవడం భ్రమ.అమెరికా సైనిక దళాలు బిన్లాడెన్ను పాక్లోనే హతమార్చినట్లుగా ఇండియా చేయడం అసాధ్యం.
కాబట్టి దావూద్ పాక్లోనే ఉన్నాడని మనం చెప్పడం, లేడని పాక్ బుకాయించడం…ఈ కథ ఇలా నడిచిపోతూనే ఉంటుంది.