ఐపిఎల్ మళ్ళీ మొదలైంది.కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రారంభమైంది.
ఇప్పటికే 3 మ్యాచ్ లు అయిపోయాయి.రెండు మ్యాచులు వన్ సైడ్ కాగా పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం అభిమానులని టెన్షన్ పెట్టింది.
ఐపిఎల్ అంటే అంతే కదా.ఒక్క ఓవర్లో మ్యాచ్ మారిపోతుంది.అందుకే ఐపిఎల్ కి అంత క్రేజ్.నిన్నటి మ్యాచ్ మరవకముందే బుధవారం మరో ఉత్కంఠగా సాగే మ్యాచ్ జరగనుందని విశ్లేషకులు అంటున్నారు.బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.ఈ సీసన్ లో ఆరు విజయాలు సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ జోరు మీదుంది.
ఆరు అపజయాలతో హైదరాబాద్ ఆఖర్లో ఉంది.అయితే ప్లేఆఫ్ కు వెళ్ళాలి అనుకుంటున్న పంత్ సేనకు బ్రేక్ వేయాలని విలియమ్సన్ జట్టు భావిస్తోంది.
ఈ మ్యాచ్ గెలిచి మరో అడుగు ముందుకేయాలని పంత్ సేన భావిస్తోంది.చూడాలి మరీ ఏ జట్టు గెలుస్తుందో.
ఇకపోతే రెండేళ్లుగా ఢిల్లీ జోరు మీదుంది.తోలి టైటిల్ గెలవాలని గట్టి ప్రయత్నమే చేస్తుంది.ఈ సీజన్ కూడా అలానే ప్రారంభించింది.ఇప్పటికి ఎనిమిది మ్యాచులు ఆడిన ఢిల్లీ ఆరు మ్యాచుల్లో గెలిచింది.
తొలి దశ ముగిసే సమయానికి అగ్రస్థానంలో నిలిచింది.అన్ని విభాగాల్లో పంత్ సేన పటిష్టంగా ఉంది.
పవర్ ప్లేలో ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా రెచ్చిపోయి ఆడుతున్నారు.మంచి స్కోర్ లు సాధించి టీం కి మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు.
మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు.రెండేళ్ల నుంచి పంత్ కూడా మంచి స్ట్రైక్ రేట్ తో రాణిస్తున్నాడు.
ఒక్క ఓవర్లో మ్యాచ్ ని మార్చేయగల ప్లేయర్ గా పంత్ రెడీ అయ్యాడు.స్టాయినిస్, స్మిత్, హెట్మైయిర్, అక్షర్ పటేల్, అశ్విన్ వరకు బ్యాటింగ్ చేయగలరు.
బౌలింగ్ లో అవేశ్ ఖాన్, ఆన్రిచ్ నార్జ్, రబాడా, అశ్విన్, అక్షర్, స్టాయినిస్ ఫామ్ లో ఉండడం ఢిల్లీకి కలిసొచ్చే విషయం.
ఇక ఈ సీజన్ లో హైదరాబాద్ ప్రదర్శన ఏమాత్రం బాలేదని చెప్పాలి.రెండేళ్లుగా రాణించి ప్లే ఆఫ్స్ చేరుతూ ఆకట్టుకున్న జట్టు ఇప్పుడు అభిమానులని పూర్తిగా నిరాశపరుస్తోంది.తొలి దశలో ఏడు మ్యాచులు ఆడిన హైదరాబాద్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.
పాయింట్ ల పట్టికలో అట్టడుగున ఉంది.అయితే ఇప్పటివరకు ఢిల్లీపై హైదరాబాద్ కి మంచి రికార్డు ఉంది.
ఈ రెండు జట్లు 19 సార్లు తలపడగా 11 సార్లు హైదరాబాదే గెలిచింది.
7 సార్లు మాత్రమే ఢిల్లీ గెలిచింది.అయితే లాస్ట్ సీజన్ నుంచి ఢిల్లీ హైదరాబాద్ కు బ్రేక్ వేస్తోంది.ఈ సీజన్లో చివరిసారి తలపడ్డ మ్యాచ్ మాత్రం అభిమానులని టెన్షన్ పెట్టింది.
ఢిల్లీ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ సమం చేసింది.దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ కు దారితీసింది.
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ నిర్దేశించిన 7 పరుగులని ఢిల్లీ ఛేదించింది.దీంతో నేడు జరిగే మ్యాచ్ కూడా టెన్షన్ గా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.