క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -13 సీజన్పై క్లారిటీ వచ్చింది.భారత్లో కరోనా పరిస్థితుల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా లీగ్ ప్రారంభం కానుందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు.
ఈ టోర్నీ సెప్టెంబర్ 19 ప్రారంభమై నవంబర్ 8న ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుందని శుక్రవారం ఐపీఎల్ చైర్మన్ ప్రకటించారు.ఈ సారి పూర్తి స్థాయి టోర్నమెంట్ ను నిర్వహిస్తామని బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు.
ఐపీఎల్ షెడ్యూల్, విధి విధానాలు తదితర అంశాలపై వచ్చే వారం జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఖరారు చేయనున్నట్లు ప్రకటించారు.అయితే ఇప్పటికే ఆయా ప్రాంఛైజీలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
ఇక విదేశాల్లో లీగ్ నిర్వాహణకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని పేర్కొన్నారు.త్వరలోనే ప్రభుత్వ అనుమతి కూడా వస్తుందని ఆశిస్తున్నామని బ్రిజేష్ పటేల్ తెలిపారు.
కరోనా పరిస్థితుల దృష్ట్యా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్ (ఎస్ఓపీ) ను కూడా రూపొందిస్తున్నామని తెలిపారు.అయితే స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలా వద్దా అనేది యూఏఈ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
యూఏఈలో మూడు క్రికెట్ మైదానాలు అందుబాటులో ఉన్నాయి.దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, షేక్ జాయేద్ స్టేడియం (అబుదాబి), షార్జా గ్రౌండ్లో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.