ఏపీలో బీజేపీ వైసీపీ ల మధ్య రాజకీయ వాతావరణం వాడివేడిగా మారింది.ఈ తరుణంలో ఆకస్మాత్తుగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడం సంచలనంగా మారింది.
ముఖ్యంగా ఏపీలో హిందూ దేవాలయాల విషయంలో జగన్ ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తోందని, జగన్ ప్రభుత్వం హిందూ దేవాలయాలపై దాడులు ప్రోత్సహిస్తోంది అన్నట్లుగా బిజెపి విమర్శలు చేస్తోంది.ఈ రెండు పార్టీల మధ్య వివాదం రోజు రోజుకీ ముదిరిపోతుంది.
మొన్నటి వరకు బీజేపీ టీడీపీ ల మధ్య వైరం తీవ్ర స్థాయిలో ఉంటుంది అనుకున్నా, ఇప్పుడు మాత్రం అన్ని పార్టీలు కట్టగట్టుకుని వైసీపీపై ఎదురుదాడి మొదలుపెట్టినట్లు వ్యవహరిస్తున్నాయి.
ఈ పరిణామాలన్నీ జగన్ కు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి.
ఒకపక్క కేంద్రంలో బీజేపీకి అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నామని, అయినా తనపై బీజేపీ ఎందుకు ఇంత కక్ష సాధిస్తుందో అర్థం కావడంలేదని జగన్ తన సన్నిహితుల వద్ద ఇప్పటికే వాపోయినట్టు తెలుస్తోంది.బిజెపి వ్యవహారం చూస్తుంటే, రానున్న రోజుల్లోనూ మరింతగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న తరుణంలో జగన్ ఆకస్మికంగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర బిజెపి పెద్దలు కలిసేందుకు ప్రయత్నించినా వారి అపాయింట్మెంట్ ఖరారు కాలేదు.
కానీ ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బిజెపి కీలక నాయకులు, మంత్రులంతా అందుబాటులో ఉంటారని జగన్ భావించే, కొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు ఇప్పటికే ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఇంత ఆకస్మాత్తుగా జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడానికి కారణాలేంటి అనే విషయంపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.ఒకవైపు అమరావతి లో చోటుచేసుకున్న వ్యవహారాలపై సిబిఐ విచారణ చేయించాలని పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీలు నిరసనలు చేస్తున్నారు.
మరోవైపు అమరావతి అక్రమాలు పై ఏసీబీ విచారణ పైన ఇప్పటికే ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.
దానిపైన సుప్రీంకోర్టు కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది.
ఇక ఏపీలో హిందూ దేవాలయాల అంశానికి సంబంధించి బిజెపి గుర్రుగా ఉండటం వంటి కారణాలతో బిజెపి పెద్దలకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు, అలాగే టిడిపి అధినేత చంద్రబాబు అమరావతి వ్యవహారం, మరికొన్ని కుంభకోణాల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా నిజాలు నిగ్గు తేల్చేందుకు తగిన విధంగా సహకరించాలని, ఇలా అనేక అంశాలపై జగన్ కేంద్ర బిజెపి పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కూడా దొరికితే, జగన్ మోదీల మధ్య అనేక అంశాలకు సంబంధించి స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.