ఎదురులేని నాయకుడుగా ఏపీలో సీఎం జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారు.ఒకవైపు ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అందిస్తూనే, మరోవైపు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకు వెళ్ళే విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు.
తన పరిపాలన గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి అనే విధంగానే జగన్ వ్యవహరిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రతిపక్షాలు తమపై అనవసర రాద్ధాంతం చేస్తూ, అనవసర ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోకుండా, ఒక వ్యూహం ప్రకారం వాటికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ, పెద్దఎత్తున నాయకులను చేర్చుకుంటూ 2024 లో కూడా వైసీపీ ప్రభుత్వమే ఏపీలో చక్రం తిప్పే విధంగా జగన్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు.
ఇంతవరకు జగన్ వ్యవహారం బాగానే ఉన్నా, పార్టీని పెద్దగా పట్టించుకోకపోవడం, కనీసం ఎంపీలు, ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇటువంటి వ్యవహారాలు చాలాకాలంగా చర్చకు వస్తూనే ఉన్నాయి.ఇదిలా ఉండగానే, ఇప్పుడు వైసీపీ లో మెజార్టీ ఎమ్మెల్యేలు జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
కోట్లకొద్దీ డబ్బులు ఇచ్చి మరీ, ఈ ఎన్నికల్లో గెలిస్తే, ఆ గెలిచిన ఆనందం కూడా తమకు దక్కకుండా చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలు అమలు విషయంలో గాని, తమకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని, పూర్తిగా తమను డమ్మీలుగా మార్చేశారనే అసంతృప్తి,పార్టీ ఎమ్మెల్యేల్లో రోజు రోజు కి పెరిగిపోతోందట.
ఇదే విషయాన్ని ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ సైతం నివేదిక ఇచ్చిందట.ఆ నివేదికలో పార్టీ వ్యవహారాలను తేలిగ్గా తీసుకుంటే, గత తెలుగుదేశం పార్టీ పరిస్థితి వైసీపీకి కూడా వస్తుందని, సీఎంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఆమోదంగానే ఉంటున్నా, పార్టీ నాయకులకు మాత్రం తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని, ఎమ్మెల్యేలు తమకు ప్రాధాన్యం దక్కకపోవడంతో తీవ్ర అసహనం గా ఉన్నారని, వారి కారణంగానే తమకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయిందని వారు ఆవేదనలో ఉన్నారట.
అక్టోబర్ 2వ తేదీన వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు ఏడాది అయిన సందర్భంగా, చప్పట్లతో వారిని అభినందించాలి అంటూ జగన్ స్వయంగా పిలుపునిచ్చినా, ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా స్పందించకపోవడానికి కారణం ఇదే అనే విషయాన్ని సైతం ఇంటిలిజెన్స్ వర్గాలు జగన్ కు నివేదిక ఇవ్వడంతో ఆయన కూడా ఆలోచనలతో పడినట్లు తెలుస్తోంది.