పీవీ సింధుకి మరో అరుదైన గౌరవం దక్కింది.బ్యాడ్మింటన్ లో స్ఫూర్తిని చాటుతున్న పీవీ సింధుని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ క్యాంపెయిన్ కి అంబాసిడర్ గా నియమించింది.
పీవీ సింధుతో పాటు కెనాడాకి చెందిన స్టార్ షట్లర్ మిచెల్లె లీ కూడా అంబాసిడర్ గా ఎంపికైంది.ఈ మేరకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఓ ప్రకటనని విడుదల చేసింది.
వాస్తవానికి పీవీ సింధు ఇప్పటికే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ‘ఇయామ్ బ్యాడ్మింటన్’ క్యాంపెయిన్ కి గ్లోబర్ అంబాసిడర్ గా ఉంది.ఈ మేరకు గత ఏడాది ఏప్రిల్ నుంచి పీవీ సింధు తన స్ఫూర్తివంతమైన మాటలతో యువ షట్లర్లలో ఉత్సాహం నింపుతోంది.
తాజాగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మరో బాధ్యతని కూడా ఆమెకి అప్పగించింది.ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ క్యాంపెయిన్ కి అంబాసిడర్ గా ఎంపికవడంపై పీవీ సింధు మాట్లాడుతూ.
ఐఓసీ తనను అంబాసిడర్ గా ఎంపిక చేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపింది.
గేమ్ లో ఛీటింగ్ లేదా పోటీలో అవకతవకలపై పోరాటంలో తన సహచర అథ్లెట్స్ కి తాను అండగా నిలబడతానని పీవీ సింధు తెలిపింది.2018లో ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ క్యాంపైన్ ను ప్రారంభించారు.పోటీల్లో జరిగే అవకతవకలు పట్ల అథ్లెట్స్, కోచ్ లు సహా ఇతర అధికారులకు దీని ద్వారా అవగాహన కల్పిస్తారు.
ఇందులో క్రీడల్లో అత్యుత్తమంగా ఎదిగే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలనే అంశంపై తమ సూచనలు, సలహాలు ఇస్తారు.ముఖ్యంగా ఆటలలో భాగంగా ఉంటూ తప్పుడు మార్గాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదాల నుంచి ఎలా దూరంగా ఉండాలనే అంశంపై మార్గనిర్దేశనం చేస్తారు.
సోషల్ మీడియా, వెబినార్ల ద్వారా యువ అథ్లెట్స్ కి పీవీ సింధు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది.వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ తో గత ఏడాది అరుదైన ఘనత సాధించిన పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది.
ఆ సమయంలో తన మాటలతో యువ షట్లర్లలో సింధు స్ఫూర్తిని నింపింది.