ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.దీని అసలు లక్ష్యం ఉమ్మడి కుటుంబాలను నిర్మించడమే.
అంటే ఈ రోజుల్లో చాలా మంది డబ్బు సంపాదించడానికి బిజీ అయిపోతున్నారు.ధన సంపాదనలో పడి కుటుంబాలకు దూరంగా వెళ్లిపోతున్నారు.
దీనివల్ల కుటుంబాలలో ప్రేమ, ఆత్మీయతలు దూరమయ్యాయి.ప్రస్తుతం ఎక్కడ చూసినా చిన్న చిన్న కుటుంబాలు మాత్రమే జీవిస్తున్నాయి.
ఒక వేళ పెద్ద కుటుంబం ఉన్నా ఏవేవో చికాకులు, మనస్పర్దల వల్ల ఆ పెద్ద కుటుంబం విడిపోతోంది.సమస్యలు, ఆర్థిక భారాలు, అవగాహన లేకపోవడం వంటివి కుటుంబాలను చీల్చుతున్నాయి.
భారతీయ వ్యవస్థలో సంస్కృతి, సంప్రదాయాలకు మూలం మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనే చెప్పాలి.గతంలో చూసినట్లైతే కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధు మిత్రులు ఉండేవారు.
దాని వల్ల ఒంటరితనం అనే భావన లేకుండా అందరూ ఆనందంగా గడిపేవారు.అయితే నేడు ఉమ్మడి కుటుంబాలనేవే లేకుండాపోయాయి.
ఉమ్మడి కుటుంబాల్లో పెండ్లయిన వెంటనే వేరు కాపురాలు పెట్టుకొని జంటలుగా ఉండి కూడా మొబైల్ ఫోన్ పట్టుకొని ఒంటరైపోతున్నారు.
సలహాలిచ్చే పెద్దవారు లేక, ఆపదలో ఆదుకునే ఆత్మీయులు రాక, బాధలను పంచుకునే బంధువులు లేక ఒంటరిగా మారుతున్నారు.
చిన్న సమస్యలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఇక్కడే ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యం తెలిసి వస్తోంది.
కుటుంబ వ్యవస్థతో మన సంస్కృతిని పిల్లలకు అందజేయడం, ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడం చేయాలి.అందుకే ఐక్య రాజ్య సమితి కుటుంబ దినోత్సవాన్ని ప్రకటించింది.
డిసెంబర్ 1989లో ప్రతి సంవత్సరం మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది.అప్పటి నుంచి ప్రపంచ కుటుంబ దినోత్సవం జరుపుకోవడం వస్తోంది.
కుటుంబంలోని మానవ విలువలను సమాజానికి చాటి చెప్పాలి.అప్పుడు కుటుంబ వ్యవస్థ బలపడుతుంది.
చికాకులు, బాధలు, కష్టాలు అనేవి దూరమవుతాయి.ఒంటితనం లేకుండా పోతుంది.
కరోనా టైంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి.అప్పుడే దేన్ని అయినా సాధించగలుగుతాము.
విజయం పొందుతాము.