ట్రంప్ హయాంలో అపకీర్తి పాలైన అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే తన లక్ష్యమని తెలిపిన జో బైడెన్ అన్న మాట ప్రకారం.విదేశాంగ విధానం, ఇమ్మిగ్రేషన్ పాలసీలో కీలక మార్పులను తీసుకొస్తున్నారు.
ఈ క్రమంలో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.దీనిలో భాగంగా హెచ్-1బీ వీసాల జారీకి పరిగణనలోకి తీసుకునే ‘ప్రత్యేక వృత్తి’ నిర్వచనంపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన చట్టాన్ని తొలగించాలని బైడెన్ యంత్రాంగం నిర్ణయించింది.
ఉద్యోగాల్లో అమెరికన్లకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పాటు విదేశీ వలసలను తగ్గించాలని ట్రంప్ పలు ఆంక్షలను ప్రతిపాదించారు.తద్వారా ఏటా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునేవారితో పాటు కార్పొరేట్ కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
తాజాగా బైడెన్ నిర్ణయం కారణంగా విదేశీయులకు ముఖ్యంగా భారతీయ కార్మికులకు, కంపెనీలకు ఊరట కలగనుంది.
హెచ్ 1 బీ వీసాల విషయంలో స్పెషాలిటీ ఆక్యుపేషన్ అనే నిర్వచనాన్ని కుదిస్తూ ట్రంప్ ప్రభుత్వం చట్టం చేసింది.
విదేశీ వృత్తి నిపుణులకు మంజూరు చేసే హెచ్-1బీ వీసాల విషయంలో ఈ చట్టాన్ని ప్రతిపాదించింది.ఇది హెచ్-1బి ఉద్యోగుల ఆఫ్-సైట్ ప్లేస్మెంట్ను పరిమితం చేస్తుంది.అలాగే, యజమాని/ కంపెనీ బాధ్యతలను కూడా పెంచుతుంది.అందుకే, ఈ చట్టం రెగ్యులేషన్ను యునైటెడ్ స్టేట్స్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డిహెచ్ఎస్) అధికారికంగా వెకేట్ చేసింది.
దీన్ని అమలుపరచే తుది నియమాన్ని ఫెడరల్ రిజిస్టర్లోనూ, అలాగే, యూఎస్ జర్నల్లోనూ ప్రచురించారు.
అక్టోబర్ 2020లో ట్రంప్ జారీచేసిన ఇంట్రిమ్ ఫైనల్ రూల్ను ఫెడరల్ జిల్లా కోర్టు వెకేట్ చేయడంతో, యునైటెడ్ నేషన్స్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ దీన్ని తొలగిస్తున్నట్లు తుది రూల్ను జారీ చేసింది.ఇదే విషయాన్ని లీగల్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ అయిన యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గత మంగళవారం తెలియజేసింది.అమెరికాలో థర్డ్ పార్టీ లోకేషన్లలో ఉద్యోగస్థుల కోసం హెచ్-1బీ వీసా ఉండాలి.
ఇది కంపెనీ సామర్థ్యంపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.కనుక `థర్డ్-పార్టీ వర్క్సైట్`, `ఎంప్లాయర్-ఎంప్లాయీ రిలేషన్షిప్`, `స్పెషాలిటీ ఆక్యుపేషన్` నిర్వచనాలను మార్చాలని ఇంట్రిమ్ ఫైనల్ రూల్ (ఐఎఫ్ఆర్) టార్గెట్గా పెట్టుకుంది.
ఈ చర్య భారతీయ ఐటి కంపెనీలను, కార్మికులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
దీంతో పాటు హెచ్-1బీ వీసా పొందడానికి విద్యార్హతల ఆంక్షలను సడలించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా భారతీయ ఐటి అభ్యర్థులకు లబ్ధి చేకూర్చనుంది.హెచ్ 1 బీ అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా.
ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు గాను అమెరికన్ కంపెనీలకు అనుమతిస్తుంది.ఈ వీసా కింద భారత్, చైనా తదితర దేశాల నుంచి ప్రతియేటా వేల మంది ఉద్యోగులను టెక్ దిగ్గజాలు నియమించుకుంటున్నాయి.
ప్రతి ఏడాదీ అమెరికా 85,000 హెచ్-1బి వీసాలను మంజూరు చేస్తుంది.ఇందులో 70% వాటా భారతీయులదే కావడం విశేషం.
మరోవైపు కొద్దిరోజులుగా హెచ్ 1 బీ వీసాలు వున్న భారతీయ ఐటీ నిపుణుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్ ఇవ్వాలని కోరుతూ అమెరికాలోని టెక్ దిగ్గజాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.ఈ కంపెనీల బృందానికి గూగుల్ నాయకత్వం వహించనుంది.
హెచ్ 4 ఈఏడీ (ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) ప్రోగ్రామ్కు మద్ధతు ఇచ్చేందుకు గాను అమెరికాలోని 30 దిగ్గజ కంపెనీలు ఒక్క తాటిపైకి వచ్చాయి.
జీవిత భాగస్వామి హెచ్1బీ గడువుకు అనుగుణంగా హెచ్4 వీసా రెన్యూవల్ చేస్తారు.అయితే ఏడాదిన్నరగా కరోనా తదితర కారణాలతో యూఎస్సీఐఎస్ ఈఏడీ రెన్యూవల్ చేయట్లేదు.దీంతో మార్చి 31 నాటికి సుమారు 91 వేల మంది భారతీయ మహిళలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి వారి కుటుంబాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో హెచ్-4 వీసాల జారీలో సుదీర్ఘ జాప్యం చోటుచేసుకుంటుండటంపై అక్కడి ప్రవాస భారతీయ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇందుకు నిరసనగా కొద్దిరోజుల క్రితం కాలిఫోర్నియాలోని శాన్ జోస్లో ‘సేవ్ హెచ్4ఈఏడీ’ పేరుతో ర్యాలీ నిర్వహించారు
.