ఒకవైపు నోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తైనా ఇంకా ప్రజలు ఆ ఎఫెక్ట్ నుండి బయటికి రాలేదు.ఇంకా అక్కడక్కడా నోట్ల కష్టాలు దర్శనం ఇస్తూనే ఉన్నాయి.
ఇప్పుడంటే రెండు వేల రూపాయల నోటు,ఐదొందల నోటు,వంద నోటు ఇలా రకరకాల నోట్లు వచ్చాయి కాని .అంతకు ముందు మనం నాణేల రూపంలోనే డబ్బుని వినియోగించేవాళ్లం.అలాంటిది వందేండ్ల క్రితం మొదటిసారి కాగితపు ముద్రణకు నోచుకున్ననోటు రూపాయి నోటు.రూపాయి నోటు ఎన్నో చరిత్రాత్మక ఘటనలను తనలో ఇముడ్చుకుంది.అటువంటి రూపాయి నోటు గురించి పలు ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.
· మనం బ్రిటీష్ పాలనలో ఉన్నప్పుడే మొదటి రూపాయి కరెన్సీ విడుదలయింది.
నవంబరు 30,1917 బ్రిటీష్ హయాంలో రూపాయి బయటకు వచ్చింది.నవంబరు 30న రిలీజ్ అయిన రూపాయి నోటులో “I promise to pay” అనే అక్షరాలు ఉండేవి.
· దేశంలో మొదట విడుదలైన రూపాయి నోటు కింగ్ జార్జ్ V ఫోటోతో ముద్రితమై ఉంది.ఆ మొదటి నోటును 1926 తర్వాత మార్చేశారు.పాత (మోడల్)వాటి విడుదలను ఆపేశారు.మళ్లీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కింగ్ జార్జ్ VI బొమ్మతో మళ్లీ పునర్మిద్రించి మళ్లీ ప్రవేశపెట్టారు.
· స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 నుంచి 60 రకాల రూపాయి నోట్లు మార్కెట్లోకి ప్రవేశించాయి.వాటన్నింటిపై ఉన్న సీరియల్ సంఖ్యలు వేర్వేరుగా ఉండటం ప్రత్యేకత.
అంతే కాకుండా వివిధ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ల సంతకాలు వాటిపై ఉన్నాయి.
· 1970 ల వరకూ మన రూపాయి నోటును పర్షియా, దుబాయి, బహ్రెయిన్, మస్కట్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాలలోనూ కరెన్సీగా వాడారు.
ఒక వేళ ఆ నాటి రూపాయి నోట్లు మీ దగ్గర ఉంటే నాణేలు, పాత కరెన్సీలు సేకరించే ఔత్సాహికుల దగ్గర నుంచి మీరు 20 నుంచి 30 వేల వరకూ సంపాదించవచ్చు.
· 1945 సంవత్సరంలో బర్మాలో రూపాయి నోట్లను పంపిణీ చేశారు.ఆర్మీ దళాల బొమ్మలతో ఎరుపు రంగుతో ఆ నోట్లు ముద్రించబడి ఉన్నాయి.
· అప్పటి రాచరిక రాజ్యాలైన ఉస్మానియా, హైదరాబాద్ 1919లో మొదటిసారి రూపాయి నోటును విడుదల చేశాయి.
తర్వాత 1943,1946లలోనూ రూపాయి నోటును ముద్రించి చలామణీలోకి తెచ్చినట్లు ఆర్బీఐ వెబ్సైట్ పేర్కొంది.
· 1877లో కాశ్మీర్ రాష్ట్రంలో శ్రీకార్ రూపాయి నోట్లను జారీ చేశారు.
మన దేశంలో ఎక్కువగా వెండి నుంచి ఇతర నాణేలకు వెళ్లడం, కాగితపు కరెన్సీకి మళ్లడం 1800 నుంచి 1900 మధ్యలోనే సాగింది.
· ఆగస్టు 15,1947లో దేశానికి స్వాతంత్రం సిద్దించిన తర్వాత మొదటి రూపాయి కరెన్సీని 1948లో జారీ చేశారు.ఆ నోటు వైవిధ్యమైన సైజు,రంగులో ఉండేది.అందులో వన్ రూపి అని 8 భాషల్లో రాసి ఉండేది.
అందులో మళయాళం లేదు.కేరళ రాష్ట్రం 1956లో అవతరణ అయినప్పటి నుంచి కేరళ రాష్ట్ర భాష అయిన మళయాళం కరెన్సీ నోట్లపైకి వచ్చింది.
· అశోక స్తూపంతో కూడిన ముద్రణతో వచ్చిన రూపాయి నోటును 1949లో ప్రవేశపెట్టారు.తర్వాత 1950 నుంచి అదే అధికారిక ముద్రణ లాగా తయారవడం మనకు గర్వకారణం.ఎందుకంటే ఏ దేశమయినా చరిత్రను గుర్తుంచుకోవాలి.మన చరిత్ర ఆనవాళ్లను చాటే వాటిలో అశోక స్తూపం ఒకటి.
· 1949లో భారత ప్రభుత్వం కొత్త డిజైన్తో రూపాయి నోటును తీసుకొచ్చింది.ఆ నోట్లపై అప్పటి ఆర్థిక కార్యదర్శి కే ఆర్ కే మీనన్ సంతకం ఉంది.
ఇటీవల 1994-95 మధ్య దేశంలో 4 కోట్ల రూపాయి కరెన్సీ నోట్లను విడుదల చేశారు.దాని తర్వాత 1995-96 నుంచి 2013-14 మధ్య ఎలాంటి రూపాయి నోట్లను విడుదల చేయలేదని కరెన్సీ నోట్ల ప్రెస్ డెప్యూటీ మేనేజర్(హెచ్ఆర్), పీఐవో జీ క్రిష్ణ మోహన్ అప్పట్లో ఒక సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానమిచ్చారు.