అల్లు అర్జున్, మంచు మనోజ్ హీరోలుగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన వేదం సినిమాలో కీలక పాత్రలో నటించి వేదం నాగయ్య గుర్తింపును సంపాదించుకున్నారు.నటనతో, హావభావాలతో మెప్పించి 30కి పైగా సినిమాల్లో నటించిన వేదం నాగయ్య నంది పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు.
అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వేదం నాగయ్య శనివారం రోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే.
వేదం నాగయ్య పూర్తి పేరు మాదాసు నాగయ్య.
వేదం నాగయ్య గుంటూరు జిల్లాలోని నకరికల్లు మండలంలోని దేచవరం గ్రామానికి చెందినవారు.ఐదు సంవత్సరాల క్రితం వేదం నాగయ్య భార్య మృతి చెందారు.
ఆయనకు ఒక కొడుకు, కూతురు కాగా ఆయన కొడుకు కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారని సమాచారం.చనిపోయే నాటికి వేదం నాగయ్య వయస్సు 75 సంవత్సరాలు కాగా సినిమాల్లోకి రాకముందు నాగయ్య గొడుగులు అమ్మి జీవనం సాగించేవారు.
ఎలాంటి శిక్షణ పొందకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నాగయ్య తన నటనతో మెప్పించడం గమనార్హం.తెలుగులో స్పైడర్, రామయ్యా వస్తావయ్యా, నాగవల్లి సినిమాల్లో కూడా వేదం నాగయ్య నటించారు.
టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నాగయ్య మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.శనివారం రోజునే వేదం నాగయ్య అంత్యక్రియలను అతని కుటుంబ సభ్యులు పూర్తి చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క నాగయ్య మృతి చెందడంతో ఆయన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి సంతాపం తెలియజేశారు.నాగయ్య కల్మషం లేని వ్యక్తి అని అనుష్క పేర్కొన్నారు.
వేదం సినిమా ప్రమోషన్స్ సమయంలో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో అనుష్కషేర్ చేశారు.అనుష్క ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.