ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు ఎట్టకేలకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ డిసైడ్ అయిపోవడం , త్వరలోనే పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ప్రకటించిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీలో చేరి తన సత్తా చాటుకున్న నేపధ్యంలో ఇప్పుడు రజినీ సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజకీయ అరంగ్రేటం చేస్తున్నారు.
అయితే చాలా కాలంగా ఆయన బిజెపి లో చేరబోతున్నారు అంటూ పెద్ద హడావుడి నడిచినా , చివరకు సొంత పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు డిసైడ్ అయిపోయింది.ఈ నెల 31వ తేదీన పార్టీ స్థాపన పై కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రజిని ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు.ఈ మేరకు పార్టీ స్థాపన పై మక్కల్ మన్రం నిర్వాహకులతో రజినీకాంత్ చెన్నైలోని తన ఇంటి వద్ద చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నిన్న ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో మక్కల్ నేతలు పార్టీ పేరును రిజిస్టర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.అలాగే ఆయనకు సైకిల్ గుర్తు కేటాయించినట్లు వార్తలు వచ్చాయి.
దీంతో రజినీ పార్టీ ఏర్పాటుపై ఢిల్లీలో హడావుడి నెలకొంది.అది కాకుండా నేడు రజినీకాంత్ 71 వ పుట్టినరోజును పురస్కరించుకుని భారీగా ఏర్పాట్లు చేశారు.
త్వరలోనే రాజకీయ ఆరంగ్రేటం చేయబోతున్న నేపథ్యంలో రజినీ పుట్టినరోజు ను పురస్కరించుకుని భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.దీంతో తమిళనాడు వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది.
రజినీ రాజకీయ ప్రవేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటును కొంతమంది సమర్థిస్తూ ఉండగా, అప్పుడే ఆయన పై రాజకీయ విమర్శలు మొదలైపోయాయి.రజిని బిజెపికి మేలు చేసేందుకు పార్టీ స్థాపిస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.