చాలా నెలల నుంచి హుజురాబాద్ ఎన్నికల విషయమై అన్ని రాజకీయ పార్టీలు, నాయకుల్లో ఆందోళన ఆశక్తి కనిపిస్తోంది.తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం కావడంతో, భారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులను ఈ నియోజకవర్గంలో మోహరించింది.
ఎక్కడా తమ గెలుపుకు ఇబ్బంది లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది.అయితే టిఆర్ఎస్ గెలుపు అనుకున్నంత ఈజీ కాదని, ముఖ్యంగా ప్రజల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉంది అనే ఇంటిలిజెన్స్ రిపోర్ట్స్, వివిధ సర్వేల నివేదికలతో టిఆర్ఎస్ ప్రభుత్వం అప్రమత్తమై అనేక పథకాలను ఈ నియోజకవర్గంలో అమలు చేస్తోంది.
అయినా గెలుపు పై అనేక సందేహాలు ఉండడంతో హుజురాబాద్ ఎన్నికలను వాయిదా వేయించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగానే వ్యవహరించారు.
ప్రస్తుతం తెలంగాణలో వరదలు, వానలు ఎక్కువగా ఉన్నాయని, అలాగే పండుగ సెలవులు కూడా ఉన్న నేపథ్యంలో అవి ముగిసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయడంతో, ఈ నియోజకవర్గంలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.
రకరకాల కారణాలతో చాలా రాష్ట్రాలు ఇదే రకమైన విజ్ఞప్తి చేయడంతో 31 అసెంబ్లీ స్థానాల్లో 3 పార్లమెంటరీ స్థానాల్లో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ పండుగ సీజన్ ముగియగానే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో, అన్ని పార్టీలు అప్రమత్తంగానే వ్యవహరిస్తూ ఉన్నాయి.
టిఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకాన్ని అమలు చేయడంతోపాటు , అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది.
చాలా రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు నియోజకవర్గంలోనే మకాం వేసి మరి పరిస్థితులను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు నివేదికలను ప్రభుత్వానికి పంపించే ప్రక్రియలో నిమగ్నం అయ్యారు.