ఆర్ధిక కష్టాల సుడిగుండంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కేంద్ర బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.కరోనా కష్టకాలం లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు కేంద్రం చేయూతనిచ్చే విధంగా కేంద్ర బడ్జెట్ ఉంటుందని, ఈ మేరకు కేటాయింపులు ఉంటాయని అంతా అంచనా వేశారు.
దీనికి తోడు కేంద్రం పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా, అన్ని రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు చేసే విధంగా, బడ్జెట్ ఉంటుందని అందరూ ఎదురు చూపులు చూడగా , బడ్జెట్ అందరినీ నిరాశకు గురిచేసింది.పేద, మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం ఊరటనివ్వకపోగా, పన్నులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో, కేంద్ర బడ్జెట్ లో పెట్రోల్, డీజిల్ రేట్లపై సమీక్షించి రేట్లు తగ్గిస్తారు అని అంతా అంచనా వేయగా, వాటి ధరలను సైతం పెంచారు.అగ్రిసెస్ పేరుతో వడ్డింపు విధించారు.
అలాగే లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ ఐ సి లు 74% ఎఫ్ డి ఐ కు అనుమతి ఇవ్వడం, ఇక తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో మొండిచేయి చూపించడం, ఎక్కడా పోలవరం నిర్వాసితుల పునరావాస కేటాయింపులు, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీల ప్రస్తావన, కొత్త రైల్వే ప్రాజెక్టులు లేక పోవడం ఎలా ఎన్నో అంశాలులో కేంద్రం ఏపీకి మొండిచేయి చూపింది.
కేంద్ర బడ్జెట్ పై బిజెపి, మినహా అన్ని పార్టీలు తీవ్ర అసంతృప్తిని వెళ్ళగక్కాయి.
ముఖ్యంగా ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే, బడ్జెట్ లో కేటాయింపులు తక్కువగా ఉండడంపై పెద్ద ఎత్తున కేంద్రంపై విమర్శలు మొదలయ్యాయి.దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున పన్నుల రూపంలో వసూళ్లు చేస్తున్న కేంద్రం మొత్తం బడ్జెట్ లో కేటాయింపులు ఉత్తరాది రాష్ట్రాలకు చేయడం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
త్వరలో ఎన్నికలు ఉన్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మాత్రమే నిధుల కేటాయింపులు ఎక్కువగా చేశారు.దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం బడ్జెట్ లో అన్యాయం జరగడంపై దక్షిణాది రాష్ట్రాల ఎంపీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
మొదటి నుంచి కేంద్రం దక్షిణాది రాష్ట్రాలు అంటే చిన్నచూపు చూస్తోందనే చర్చ ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.జమిలి ఎన్నికలు పెట్టి అధ్యక్ష పద్ధతిలోకి మార్చాలనే వ్యూహం కేంద్ర బడ్జెట్ లో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.జమిలి ఎన్నికలు జరిగితే, దేశం రెండుగా విడిపోవడం ఖాయమని, అలా జరిగితే అధ్యక్షుడు కావడానికి దక్షిణ భారత ప్రజల ఓట్లు అవసరం ఉండదని చెబుతున్నారు.
జమిలి ఎన్నికలు జరగగానే దేశ విభజన ఉద్యమం మొదలవుతుందని, అదే జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుందని విశ్లేషిస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరం లేకుండా, అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పుడు ఇక్కడి ప్రజలు ఎందుకు ఊరుకుంటారు అని, మోదీ ప్రధాని అయిన తరువాత, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిందనే విషయాన్ని రేవంత్ ఎత్తి చూపుతున్నారు.
పన్నుల రూపంలో కేంద్రానికి టాక్స్ ఎక్కువ కడుతోంది దక్షిణాది రాష్ట్రాలే అని, కానీ కేంద్రం మాత్రం ఉత్తరాది రాష్ట్రాలపైన ఎక్కువ ప్రేమ చూపిస్తోందని మండిపడుతున్నారు.ఇదిలా ఉంటే దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై త్వరలోనే పెద్ద ఉద్యమం కూడా మొదలు అయ్యే అవకాశం ఉన్నట్టుగా హడావుడి కనిపిస్తోంది.
అయితే ఈ ఉద్యమం ఎవరు మొదలుపెడతారు ? ఎక్కడి నుంచి మొదలు పెడతారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.