ముందు నుంచి జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగానే బ్రిటన్ నూతన ఆర్ధిక మంత్రిగా ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ నియమితులయ్యారు.ప్రస్తుతం దేశ ఆర్ధిక మంత్రిగా ఉన్న సాజిద్ జావిద్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో.
గురువారం రిషిని ఆర్ధిక మంత్రిగా ఖరారు చేశారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.
రిషి సునక్ ప్రస్తుతం ట్రెజరీ విభాగానికి ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈయన నియామకంతో మొత్తం ముగ్గురు భారత సంతతి ఎంపీలు ఆయన కేబినెట్లో స్థానం సంపాదించినట్లయ్యింది.ఇప్పటికే ప్రీతి పటేల్ హోంశాఖ కార్యదర్శిగా, అలోక్ శర్మ అంతర్జాతీయ అభివృద్ది శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
భారత సంతతికి చెందిన రిషి సునక్ ఇంగ్లాండ్లోని హాంప్షైర్ కౌంటీలో జన్మించారు.ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్లో పట్టా పొందారు.ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.రిషి సునక్ తండ్రి యూకేలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎంబీఏ చదివే రోజుల్లో తన తోటి విద్యార్ధిని అయిన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమ వివాహం చేసున్నారు.వీరికి ఇద్దరు కుమార్తెలు.
రిషి సునక్ కుటుంబం పంజాబ్ నుంచి యూకేకు వలస వెళ్లింది.రాజకీయాల్లోకి రాకముందు రిషి సునక్ పలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్లో పనిచేశారు.2015 నుంచి యార్క్షైర్లోని రిచ్మండ్కు ఎంపీగా ఉన్నారు.గతంలో థెరిసా మే ప్రభుత్వంలో రిషి సునక్ మంత్రిగా పనిచేశారు.