కరోనా వ్యాధి వ్యాప్తిలో మరియు అరికట్టడంలో రోజుకో కొత్త వింత, రోజుకో కొత్త మలుపు ఈ నేపథ్యంలోనే తాజా అధ్యయనంలో మరో కొత్త విషయం తెలిసింది.మొదటిసారి వైరస్ సోకి చికిత్స తీసుకొని కోలుకున్న తర్వాత రెండోసారి వైరస్ సోకితే ప్రభావం తక్కువగా ఉంటుంది అనే వాదనకు తావు లేదు.
రెండోసారి వైరస్ సోకితే వ్యాధి ప్రభావం అధికంగానే ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలో యాంటీబాడీస్ ఉన్నాకూడా రెండోసారి వైరస్ సోకిన వారిలో కొందరికి మొదటి సారి కన్నా వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉందని అధ్యయన కమిటీ తేల్చిచెప్పింది.
ఢిల్లీలోని సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జనోిమిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ, ముంబైలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ జెనిటిక్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ, వీరితో పాటు ముంబై లోని కస్తూర్బా హాస్పిటల్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్, పీడీజీ హిందూజా హాస్పిటల్ నిపుణులు కలిసి చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.
వ్యాధి రీ ఇన్ఫెక్షన్ ఈ విషయంలో ఆధారాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి అని సి ఎస్ ఐ ఆర్, ఐజిఐబి శాస్త్రవేత్త డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు.
అధ్యయనంలో భాగంగా మొదటిసారి స్వల్ప లక్షణాలతో వైరస్ సోకిన నలుగురు యువ హెల్త్ కేర్ వర్కర్లను పరీక్షించారు.వీరికి కోలుకున్న తరువాత మరికొద్ది వారాల్లో మళ్లీ వ్యాధి సోకింది.
రెండోసారి తీవ్రమైన వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరి, చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.నలుగురిలో ఒకరికి ప్లాస్మా చికిత్స కూడా చేయాల్సి వచ్చింది.
వ్యాధి నుండి కోలుకున్న తర్వాత ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధ్యయనంలో స్పష్టంగా తేలిందని తెలిపారు.వైరస్ నుంచి రక్షణ స్వల్పకాలమేనని, చికిత్సలో రోగ నిరోధక శక్తికి ఎలాంటి హామీ ఉండదని స్పష్టం చేశారు.