ఒక జంటకు పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తుంటారు పెద్దలు.ఇక ప్రేమ వివాహాలు చేసుకునే వారు ఎదుటి వ్యక్తి తమకు నచ్చితే చాలు అనుకుంటారు.
మరికొందరు తమ అభిప్రాయాలు కలిస్తే చాలు పెళ్లిపీటలు ఎక్కేస్తుంటారు.కానీ ఇండోనేషియాలో మాత్రం పెళ్లి జరగాలంటే ఓ కోర్సు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందేనట.
పెళ్లి కావాలంటే కోర్సు చేయడమేమిటి అనుకుంటున్నారా.? అయితే అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం.
ఇండోనేషియా ప్రభుత్వం పెళ్లి చేసుకోవాలనుకునే జంటల కోసం మూడు నెలల పెళ్లి కోర్సును కొత్తగా ప్రవేశపెట్టనుంది.ఈ కోర్సును అక్కడి ప్రభుత్వం 2020 నుంచి ఉచితంగా అందించనుందట.
పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఈ కోర్సు పూర్తి చేసి టెస్టు పాసైతేనే పెళ్లికి అర్హులని అక్కడి ప్రభుత్వం నిర్ధారిస్తోంది.ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందిస్తోంది.
ఈ కోర్సు చేయడం వల్ల భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారని, సంతానం, పిల్లల పెంపకం వంటి విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఇండోనేషియా ప్రభుత్వం ఆశిస్తుంది.
పెళ్లి కోసం కోర్సు చేయడం, టెస్టు పాసు కావడం ఏమిటో అని పలువురు తలలు పట్టుకుంటున్నారు.
కానీ ఇది ఖచ్చితంగా అమలు చేసేందుకు ఇండోనేషియా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఈ కోర్సు వల్ల అక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి అంటున్నారు ఇతర దేశస్థులు.
మరి ఇలాంటి కోర్సు మనదేశంలో పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించండి.