కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు మూడు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అన్నదాతలకు మనదేశంతో పాటు అంతర్జాతీయంగానూ మద్ధతు లభిస్తోంది.
అయితే రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ తర్వాతి నుంచి పరిస్థితులు మారిపోయాయి.రైతుల ఆందోళన ముసుగులో ఖలీస్తానీ వేర్పాటు వాదులు దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారంటూ నిఘా వర్గాలు సంచలన నివేదికను బయటపెట్టాయి.
దీనికి తోడు రైతులకు మద్ధతుగా ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ ట్వీట్ చేసిన ‘‘టూల్ కిట్ ’’ వ్యవహారం ఇప్పుడు రాజకీయాలను హాట్ హాట్గా మారుస్తోంది.
ఈ సంగతి పక్కనబెడితే.
రైతుల ఆందోళనకు మద్ధతుగా కెనడా, అమెరికాలలో కొందరు ఖలీస్తానీ వేర్పాటు వాదులు ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తున్నారు.అయితే వారికి పోటీగా కెనడాలోని సిక్కు వర్గం భారతదేశ ఐక్యత కోసం ర్యాలీలు నిర్వహిస్తోంది.
ఇది కొందరు ఖలిస్తానీయులకు కంటగింపుగా మారింది.
వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో భారత ప్రభుత్వానికి వీరు అండగా నిలవడంతో బెదిరింపులు వస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురిస్తోంది.
అత్యాచారంతో పాటు హింసాత్మక చర్యలకు పాల్పడతామని, వ్యాపారాలను దెబ్బతీస్తామంటూ కెనడాలోని భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులను ఆగంతకులు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.దీంతో గ్రేటర్ టొరంటో, వాంకూవర్, మెట్రో వాంకూవర్, కాల్గరీ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇక్కడున్న 28 కెనడా భారతీయ సంఘాలు ఈ అంశాన్ని కెనడా ప్రజా భద్రత, అత్యవసర సంసిద్ధత శాఖా మంత్రి బిల్ బ్లెయర్కు ఓ లేఖ ద్వారా తెలియచేశారు.మరోవైపు ఈ బెదిరింపుల పట్ల ఇక్కడి భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో కెనడా భారతీయులు, ఆ విషయాన్ని స్థానిక పోలీసులకు వెంటనే తెలియచేయాల్సిందిగా కెనడాలో భారత హై కమిషనర్ అజయ్ బసారియా సూచించారు.