ఇటీవల యూఎస్- కెనడా సరిహద్దుల్లో గడ్డ కట్టిన స్థితిలో ఒక చిన్నారి సహా నలుగురు భారతీయులు శవాలుగా తేలిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.భారత ప్రభుత్వంతో పాటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో మానిటోబా ప్రావిన్స్కు చెందిన ఇండో కెనడియన్ కమ్యూనిటీ మరణించిన వారి జ్ఞాపకార్ధం ప్రార్ధనలు చేసింది.సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంస్మరణ సభలో విన్నిపెగ్కు చెందిన హేమంత్ షా మాట్లాడుతూ.
నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదకరమైనదన్నారు.మానిటోబాతో పాటు కెనడా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ ఘటనతో షాక్కు గురయ్యారని హేమంత్ అన్నారు.
కాగా.ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా.మృతులు ఎవరన్న దానిని ఇంకా కెనడా అధికారులు గుర్తించలేదు.అయితే ప్రాథమిక అంచనా ప్రకారం మృతులు గుజరాత్కు చెందినవారుగా తెలుస్తోంది.
మృతుల బంధువులతో ఒట్టావాలోని భారత హైకమీషన్ కార్యాలయం, కెనడియన్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.మంగళవారం నాలుగు మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించనున్నారు.
మానిటోబా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆర్సీఎంపీ) ఒక ప్రకటనలో మాట్లాడుతూ.కొన్ని మీడియా సంస్థలు నలుగురు బాధితుల గుర్తింపులను ప్రచురిస్తున్నాయని తెలిపారు.అయితే చట్టాన్ని అమలు చేసే వారిగా.మృతుల గురించి 100 శాతం నిర్ధారణ అయిన తర్వాతే వారి పేర్లను, ఇతర వివరాలను వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
దర్యాప్తు అధికారులు మానిటోబా చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయంతో సన్నిహితంగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.అలాగే మానిటోబాకు వచ్చిన భారతీయ కాన్సుల్ అధికారులతో కూడా టచ్లో వున్నామని.
వారి గుర్తింపును ధ్రువీకరించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామన్నారు.టోరంటోలోని భారతీయ కాన్సులేట్కు చెందిన ఇద్దరు అధికారుల బృందం విన్నిపెగ్లోని స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటోందని చెప్పారు.
ఐడెంటిటీని గుర్తించిన నాటి నుంచి మృతదేహాలను భారత్కు పంపేవరకు అవసరమైన అన్ని చట్టపరమైన లాంఛనాలను పూర్తిచేసే వరకు ఇండియన్ ఎంబసీ అధికారులు అక్కడే మకాం వేయనున్నారు.