ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.ఇందుకు సంబంధించి ఇప్పటికే కమిటీతో పాటు దానికి అనుబంధంగా మరో నాలుగు సబ్ కమిటీలను నియమించింది ఏపీ సర్కార్.
ప్రస్తుతం ఆయా కమిటీల అధ్యయనం కొనసాగుతోంది.జిల్లాల పునర్విభజన అనేది సెంటిమెంట్లతో ముడిపడి వుండటంతో పాటు అనేక భౌగోళిక ప్రతిబంధకాలు ఉన్నందున జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
తమ జిల్లాకు ఆ పేరు పెట్టాలని, తమ నియోజకవర్గాన్ని ఆ జిల్లాలో కలపొద్దని ఇలా రకరకాల డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.
తాజాగా తెలుగుదేశం పార్టీ మద్ధతున్న ఇండో- అమెరికన్ బ్రాహ్మణ సమాఖ్య కొత్తగా ఏర్పడనున్న జిల్లాకు పీవీ నరసింహరావు పేరు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ను కోరింది.
బహుభాషా కోవిదుడుగా, అపర చాణుక్యుడుగా, ఆర్ధిక సంస్కరణల ద్వారా పీవీ దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపించారని ఈ సంఘం ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ప్రశంసించింది.ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 25 జిల్లాల్లో ఒక జిల్లాకు పీవీ నరసింహారావు పేరు పెట్టాలని ఈ సంఘం ఛైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ కోరారు.
తన సమర్థతతో దేశాన్ని నడిపించి తెలుగువారి కీర్తిని నలుదిశలా వ్యాపించజేశారని ఆయన చెప్పారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా చర్యలు చేపడుతోంది.హైదరాబాద్లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా, ప్రేమికులకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న నెక్లెస్ రోడ్ పేరును మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.నెక్లెస్ రోడ్లో పీవీ ఘాట్ ఉన్నందున ఆ మార్గానికి పీవీ జ్ఞాన్ మార్గ్ అని పేరు పెట్టాలని ముఖ్యమంత్రి భావించారు.
అలాగే పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.