ఇండియన్ మొదటి ఆస్కార్ విన్నర్ ఎవరంటే ఏ.ఆర్.
రెహమాన్ అని ఎక్కువ మంది టక్కున చెబుతారు.అయితే రెహమాన్ కంటే ముందుగా 38 ఏళ్ల క్రితమే ఇండియాకి చెందిన ఒక వ్యక్తి ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.
ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.ఇండియా సినిమాలకి ఆస్కార్ అవార్డులు రాకపోవడంతో ఏఆర్ రెహమాన్ కూడా ఓ హాలీవుడ్ మూవీకి ఆస్కార్ అవార్డు తీసుకున్నాడు.
కానీ పెద్దగా గుర్తింపు లేని కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీలో ఓ మహిళ మొదటి ఆస్కార్ ని ఇండియా తరుపున సొంతం చేసుకున్నారు.అది కూడా ఒక ఇండియా స్టోరీకే కావడం విశేషం.ఆమె పేరు భాను అతైయా.91 ఏళ్ల వయస్సులో ఆమె తాజాగా మృతి చెందారు.1982లో వచ్చిన ‘గాంధీ’ చిత్రానికి గాను ఆమె బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.
భాను చాన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
గత మూడేళ్ళ నుంచి మంచానికే ఆమె పరిమితం అయ్యి ఉంది.ఆరోగ్యం క్షీణించడంతో ముంబయిలోని కొలాబాలో తన నివాసంలో ఆమె ఈ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుమార్తె రాధిక వెల్లడించారు.
తన తల్లి భాను గత ఎనిమిదేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారని, అయితే శస్త్రచికిత్సకు ఆమె నిరాకరించిందని రాధిక వివరించారు. 2015 నుంచి నడవలేని స్థితికి చేరుకున్నారని చెప్పారు.
నేటి ఉదయం నిద్రలోనే చనిపోయినట్టు తెలిపారు.ఆమె బాలీవుడ్ లో 50కి పైగా చిత్రాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది.
రెండు సార్లు నేషనల్ అవార్డు కూడా అందుకుంది.అయితే ఇండియన్ మొదటి ఆస్కార్ విన్నర్, రెండు నేషనల్ అవార్డులు అందుకున్న భాను అతైయా చనిపోయింది అనే వార్త తెలిసిన కూడా బాలీవుడ్ సెలబ్రెటీ ప్రముఖులలో ఎవరూ పెద్దగా స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా మారింది.
ఆ మృతి పట్ల ఏ ఒక్కరు ఒక్క కామెంట్ కూడా చేయకపోవడం ఒకింత విచారకరం అని చెప్పాలి.