ఉపాధి కోసం, నాలుగు రాళ్లు సంపాదించేందుకు విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో వేతనాలు చెల్లించపోవడం, మోసం తదితర కారణాలపై విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల నుంచి సుమారు 13 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.
మురళీధరన్ పార్లమెంట్కు తెలిపారు.
మొత్తం 102 దేశాల్లో ఒక్క సౌదీ అరేబియా నుంచే అత్యధికంగా 3,844 ఫిర్యాదులు అందినట్లు ఆయన వెల్లడించారు.
విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2019లో అక్టోబర్ 31 నాటికి 13,665 ఫిర్యాదులు, 2018లో 17,379 ఫిర్యాదులు భారత ప్రభుత్వానికి అందాయి.
భారతీయుల నుంచి ఫిర్యాదులను అందుకున్న వెంటనే ఆయా దేశాల్లో ఉన్న భారత హైకమీషన్లు స్థానిక ప్రభుత్వ అధికారులతో సమావేశమై సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తున్నాయని మురళీధరన్ పేర్కొన్నారు.ఇదే సమయంలో ఉపాధి సంబంధిత ఫిర్యాదులపైనా వేగంగా స్పందించి విదేశీ యాజమానులతో నేరుగా చర్చలు జరుపుతున్నాయని ఆయన తెలిపారు.మరోవైపు కువైట్లో కార్మికుల సేవలను ఉపయోగించుకునేందుకు మొబైల్ యాప్లను ఉపయోగిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించిన మురళీధరన్… అటువంటి వాటి బారిన భారతీయులు పడలేదని వెల్లడించారు.
ఆ దేశ చట్టాలు మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకమని.కువైట్ ప్రభుత్వం కూడా మీడియా కథనాలపై స్పందించిందని అన్నారు.