గత ఏడాది కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జనాలు ఇంటికే ఎక్కువగా పరిమితం అయిపోయారు.ఇండియాలో అయితే పల్లె నుంచి పట్నం వరకు ప్రజలంతా ఇంటిపట్టునే ఉన్నారు.
అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకి రాలేదు.ఈ సమయంలో ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్స్ కూడా ఓపెన్ లేకపోవడంతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వైపు ఎక్కువగా ప్రజలు దృష్టిపెట్టారు.
యుట్యూబ్ ఛానల్స్ నుంచి ఓటీటీ ప్లేట్ ఫామ్స్ వరకు అన్నింటికీ కనెక్ట్ అయ్యారు.ముఖ్యంగా ఓటీటీ ఎంటర్టైన్మెంట్ వైపు ఎక్కువగా దృష్టిపెట్టారు.
అందులో వచ్చే వెబ్ సిరీస్ లకి, పాత, కొత్త సినిమాలు చూస్తూ టైం స్పెండ్ చేశారు.ఓ విధంగా చెప్పాలంటే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ అందించే ఓటీటీ చానల్స్ లో కరోనా లాక్ డౌన్ ఒక వరంలా లభించిందని చెప్పాలి.
లాక్ డౌన్ కి ముందు వరకు ఒక మోస్తరుగా ఉన్న ఓటీటీ చానల్స్ వ్యాపారం ఈ లాక్ డౌన్ టైంలో విపరీతంగా పెరిగిపోయింది.అలాగే మెజారిటీ ప్రేక్షకులు కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపించారు.
ఈ విషయాన్ని తాజాగా ఒక సర్వే బయటపెట్టింది.
బిజినెస్ రంగంలో పురోభివృద్ధిపై రిపోర్ట్ అందించే ఫిక్కీ ఓటీటీల వృద్ధి పైనా కళ్లు భైర్లు కమ్మే నిజాల్ని బయటపెట్టింది.
ఫిక్కీ రిపోర్ట్ ప్రకారం ఓటీటీల ఆదాయం 2017లో 2019 కోట్లు ఉంటే 2020 డిసెంబర్ నాటికి 4500 కోట్లకు పెరిగిందట.ఇప్పటికి భారతదేశంలో 50కోట్ల మంది చేతిలో మొబైల్స్ ఉంటే ఇందులో 35.5 కోట్ల మంది ఓటీటీల్ని వీక్షిస్తున్నారని సర్వేలో తేలింది.ఇందులో 60 శాతం మంది 18-35 ఏళ్ల వయసులోపు ఉన్నారని తెలిసింది.
మొత్తానికి ఓటీటీ కంటెంట్ కి ప్రస్తుతం మంచి మార్కెట్ ఉందని దీనిని బట్టి అర్ధమవుతుంది.రానున్న రోజుల్లో ఈ ఓటీటీ వ్యాపారం మరింత పెరిగే అవకాశం ఉంది.
అలాగే నేటి యువతరం కొత్తదనం ఉన్న కంటెంట్ కి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారని ఈ సర్వే బట్టి అర్ధమవుతుంది.