యూకేలో స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిలో భారతదేశం ముందు వరుసలో నిలిచింది.యూకే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఒఎన్ఎస్) గణాంకాల ప్రకారం… 2019లో 37,500 మంది భారతీయ విద్యార్ధులు టైర్-4 స్టడీ వీసాను అందుకున్నారు.
ఇది గతేడాదితో పోలిస్తే 93 శాతం పెరుగుదలగా నమోదైంది.అలాగే టైర్ – 4 కేటగిరీలో భారతీయులు గత ఎనిమిదేళ్లుగా అత్యథిక సంఖ్యలో వీసాలు అందుకున్నారు.
ఇక భారతీయ నిపుణులు యూకే అందించే టైర్-2 వీసా విభాగంలో ప్రపంచ దేశాలన్నింటిలోకి ఆధిక్యంలో ఉన్నారు.గతేడాది భారతీయ కార్మికులకు బ్రిటన్ ప్రభుత్వం 57,000 వీసాలు మంజూరు చేసింది.
స్టూడెంట్ వీసా సంఖ్యలో ఈ అసాధారణ పెరుగుదల యూకే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థకు, భారతీయ విద్యార్ధుల అసాధారణ ప్రతిభకు నిదర్శనమని భారత్లో బ్రిటన్ హైకమీషనర్ జాన్ థామ్సన్ తెలిపారు.అదే సమయంలో భారతీయ పర్యాటకులకు సైతం యూకే మంచి గమ్యస్థానంగా మారింది.
గతేడాది 5,15,000 మందికి పైగా భారతీయ పౌరులకు విజిట్, టూరిస్ట్ వీసాలు మంజూరు చేశారు.ఇది గతేడాదితో పోలిస్తే 8 శాతం పెరుగుదల.మొత్తంగా చూస్తే.2019లో యూకే వీసా కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయ పౌరులలో 95 శాతం మందికి వీసాలు లభించడం విశేషం.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన తర్వాత ఆ దేశ ప్రభుత్వం పాయింట్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.దీని సాయంతో బ్రిటన్కు నైపుణ్యం, ప్రతిభ ఉన్న వలసదారులను ఆకర్షించాలని ఆ దేశ ప్రభుత్వం గట్టి పట్టుదలగా ఉంది.ఈ విధానం ద్వారా భారతీయులకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు భావిస్తున్నారు.