న్యూఢిల్లీ: భారతీయుల ఆయుష్షు త్వరగా తీరిపోనుందట.యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు అనుబంధంగా ఉన్న ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ ఈ విషయాన్ని తెలియజేసింది.
తాజాగా ఇనిస్టిట్యూట్ చేసిన అధ్యయనంలో 40 శాతం భారతీయుల ఆయుష్షు తొమ్మిది ఏళ్లకుపైగా తగ్గనున్నదని తేలింది.దీనికి కాలుష్యమే ప్రధాన కారణమని స్పష్టం చేసింది.
భారతీయుల సగటు ఆయష్షు ప్రస్తుతానికి 65 నుంచి 70 గా ఉంది.తాజాగా చికాగో యూనిర్సిటీ చెప్పిన లెక్కల ప్రకారం ఈ సగటు ఆయుష్షు 56 నుంచి 61 మధ్య ఉండనుంది.
భారతదేశంలో కాలుష్య తీవ్రత అధికంగా ఉందని, ఈ పరిస్థితిని అదుపు చేయకపోతే ఊహించలేనన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ తన అధ్యయనంలో వెల్లడించింది.ఇదిలావుండగా ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది.
కాగా దేశంలో కాలుష్య కోరల్లో చిక్కుకున్న 102 నగరాల్లోని కాలుష్య ప్రభావాన్ని 2024 నాటికి 20 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గించాలని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం లక్ష్యంగా నిర్దేశించుకుంది.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని సదరు ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది.