కరోనా కారణంగా సామాజిక పరిస్థితులు నానాటికి దిగజారీపోతున్నాయి.తుమ్మినా, దగ్గినా తోటి మనిషిని అంటరానివారుగా చూస్తోంది సమాజం.
ఇదే సమయంలో కొన్ని దేశాల ప్రజల రాకపై ఏకంగా ప్రభుత్వాలే నిషేధం విధించడం దురదృష్టకరం.ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొని ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది ఓ భారతీయురాలు.
భారతదేశానికి చెందిన ప్రియా మెహతా దుబాయ్లోని ఓ వాణిజ్య ప్రకటనల సంస్థలో పనిచేస్తున్నారు.ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన బంధువులను చూసేందుకు ఇటీవల ఆమె దుబాయ్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు.
తిరిగి దుబాయ్ వెళ్లేందుకు జూలై 4న శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ మీదుగా టికెట్ బుక్ చేసుకున్నారు.
అయితే ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత దుబాయ్కు వెళ్లే విమానంలో ప్రయాణించేందుకు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ప్రియాను అనుమతించలేదు.కరోనా కారణంగా యూఏఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధితురాలి వద్ద యూఏఈ పౌరసత్వ గుర్తింపు కార్డు లేదు.అందువల్లే తాము ప్రియా మెహతాను ప్రయాణానికి అనుమతించలేదని లుఫ్తాన్సా పేర్కొంది.
దీంతో ఆమె నాలుగు రోజులుగా ఎయిర్పోర్ట్ లాంజ్లోనే ఉంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ఆ కార్డు అవసరం లేదని రెండు విమానయాన సంస్థలు చెప్పడం వల్లే తాను టికెట్లు బుక్ చేసుకున్నానని, లేనిపక్షంలో అమెరికాలోనే ఉండిపోయేదానినని ప్రియా తెలిపారు.
తనకు సాయం చేయాల్సిందిగా దుబాయ్ సంస్థను ప్రియా ఆశ్రయించారు.చివరికి వారు పంపిన పత్రాలను సైతం సదరు విమానయాన సంస్థ ఆమోదించలేదని, ఇప్పటి వరకు 13 సార్లు టికెట్లను మార్చుకున్నట్లు బాధితురాలు వాపోయారు.
యూఏఈలో తనకు ఎవరూ లేరని తన తండ్రి భారత్లోనే నివసిస్తున్నట్లు ప్రియ చెప్పారు.