భారత్లో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అమెరికా ప్రభుత్వం మనదేశంపై ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే.మే 4వ తేదీ నుంచి భారత్ నుంచి అమెరికాకు ప్రయాణాలను నిషేధిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
కొన్ని విభాగాలకు చెందిన విద్యార్ధులు, జర్నలిస్టులు, కొందరు వ్యక్తులకు మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు.ఈ ట్రావెల్ బ్యాన్ ఎన్నాళ్లు అమల్లో వుంటుందన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.
ఈ నిర్ణయం మిలియన్ల మంది భారతీయులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నట్లుగా ఓ నివేదిక తెలిపింది.
కుటుంబానికి ఆధారమైన కొంతమంది ప్రస్తుతం భారత్లోనే చిక్కుకుపోయారు.
మరికొంత మంది తల్లులు తమ చిన్నారులకు దూరమయ్యారు.నిరవధికంగా నిషేధం విధించడంతో అది ఎప్పుడు ముగుస్తుందోనని భారత్లో చిక్కుకున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రావెల్ బ్యాన్తో పాటు భారత్లోని కోవిడ్ పరిస్ధితుల నేపథ్యంలో ఇక్కడి అమెరికా కాన్సులేట్లు సైతం మూతపడ్డాయి.తన భర్త హెచ్1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్నారని.
మా మామగారు చనిపోవడంతో అంత్యక్రియల కోసం ఆయన గత నెల 17న భారత్కు వెళ్లారని ఓ మహిళ చెప్పారు.తన భర్తకు హెచ్1బీ వీసా ఉన్నప్పటికీ, అమెరికాకు తిరిగి రావాలంటే పాస్పోర్ట్పై వీసా స్టాంపింగ్ కావాలని ఆమె వెల్లడించారు.
ఇక తన తొమ్మిది ఏళ్ల బాబు అమెరికాలో ఉన్నాడని, తాను మాత్రం ఇక్కడే చిక్కుకుపోయానని మరో వివాహిత ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా కాన్సులేట్ను మూసివేయడంతో హెచ్1బీ వీసా స్టాంపింగ్ కుదరక తాను భారత్లో ఇరుక్కుపోయానని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
అటు విద్యార్ధులది కూడా ఇదే పరిస్ధితి.కోవిడ్ కారణంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో వున్న విద్యార్ధుల్ని ఇప్పటికే ఇంటికి పంపించేశారు.ప్రస్తుతం అమెరికాలో వైరస్ కాస్త నెమ్మదించింది.దీంతో అక్కడికి వెళ్లేందుకు తిరిగి ఏర్పాట్లు చేసుకుంటున్న వేళ భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్ విద్యార్ధుల ఆశలపై నీళ్లు చల్లింది.
అన్ని దేశాలు ఇండియా నుంచి వచ్చే విమానాలు, ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి.ఇందులో అమెరికా కూడా వుంది.
అయితే విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వారికి మినహాయింపునిచ్చింది అమెరికా.అగ్రరాజ్యంలో అడ్మిషన్ పొందిన కాలేజ్ లేదా యూనివర్సిటీలో ఆగస్టు 1వ తేదీ, తర్వాత క్లాసులు ప్రారంభమవుతున్నట్లయితే అలాంటి భారతీయ విద్యార్ధులు తమ దేశంలోకి రావొచ్చని తెలిపింది.ఎఫ్-1, ఎం-1 వీసాలున్న విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక్కడి వరకు బాగానే వుంది కానీ.కరోనా నేపథ్యంలో భారత్లోని యూఎస్ ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాలను అమెరికా ప్రభుత్వం మూసివేసింది.దీంతో వీసాలకు ఇంటర్వ్యూలు జరగడం లేదు.
ఈ కారణం చేత విద్యార్ధులు వారి సెమిస్టర్ ప్రారంభ తేదీలను కోల్పోయే అవకాశం వుంది.అయితే నిర్ణీత సమయంలోగా అమెరికాకు చేరుకోవడం ఆలస్యమవుతుందని భావిస్తే.
వారు వెంటనే యూనివర్సిటీలకు సమాచారం అందించాలి.దీనిని స్టూడెండ్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డ్లో అప్డేట్ చేయడం జరుగుతుంది.
ప్రస్తుత కోవిడ్ పరిస్ధితుల నేపథ్యంలో వీసా ఆలస్యం జరిగితే భారత్ నుంచి విద్యార్ధులు తమ మొదటి సెమిస్టర్ క్లాసులకు ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా హాజరుకావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇక్కడ మరో వెసులుబాటు కూడా వుంది.
భారత్పై ప్రయాణ నిషేధం వున్నప్పటికీ.భారతీయ విద్యార్ధులు సింగపూర్, యూఏఈలలో వున్నట్లయితే ఈ ట్రావెల్ బ్యాన్ వారికి వర్తించదు.
ఉదాహరణకు ఒక విద్యార్ధి అమెరికాకు రాకముందు 14 రోజుల కంటే ఎక్కువ కాలం భారత్ కాకుండా మరో దేశంలో గడిపినట్లయితే.వారు నిషేధం కిందకు రారు.
అందువల్ల విద్యార్ధులు ఈ మార్గాల ద్వారా అమెరికాకు చేరుకుని సెమిస్టర్కు హాజరుకావొచ్చని కొందరు సలహా ఇస్తున్నారు.అయితే ఇప్పుడు తక్కువ దేశాలే భారతీయ ప్రయాణీకులను అనుమతిస్తుండటం గమనించాల్సి వుంది.