కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలు దెబ్బతింటున్నాయి.నిర్మాణం, రిటైల్, రవాణా, వాణిజ్యం, టూరిజం ఇలా అన్నిటి పరిస్ధితి దారుణంగా వుంది.
వాటితో పాటు అత్యంత కీలకమైన విద్యా రంగం కూడా ఈ పెను సంక్షోభం ధాటికి విలవిలలాడుతోంది.ఇప్పటికే అన్ని దేశాల్లోనూ కీలక పరీక్షలు వాయిదాపడగా, ఈ ఏడాదైనా అడ్మిషన్లు వుంటాయా లేదా అన్న ప్రశ్నలు ఎంతోమందిని వేధిస్తున్నాయి.
ఆర్ధిక వ్యవస్థలో విద్యా రంగం కూడా భాగమే.ఇక్కడ చదువు ఒక్కటే ప్రామాణికంగా తీసుకోకూడదు.
దీనిని ఆధారంగా చేసుకుని మనుగడ సాగిస్తున్న కొన్ని ఇతర రంగాలు కూడా ఆదాయాన్ని పొందుతున్నాయి.
కోవిడ్ కారణంగా దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో వున్న విద్యార్ధుల్ని ఇప్పటికే ఇంటికి పంపించేశారు.
ఎన్నో కోర్సులు ఆన్లైన్ కిందకి వచ్చేశాయి.లాక్డౌన్లు, ఆంక్షలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో క్యాంపస్లో విద్యార్ధుల కళ అన్నదే లేకుండా పోతుంది.
ఇక ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పిన్స్, చైనా వంటి దేశాల్లో భారతీయ విద్యార్ధులు పెద్ద సంఖ్యలో చదువుకుంటున్నారు.
వీరి వల్ల ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలకు సమకూరుతోంది.అయితే కోవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో పలు దేశాల్లో చదువుకుంటున్న విద్యార్ధులు తిరిగి స్వదేశానికి వచ్చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిన్ భారతీయ విద్యార్ధులకు శుభవార్త చెప్పారు.ఇండియా నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు, విద్యార్ధులను త్వరలోనే తమ దేశానికి అనుమతిస్తామని ఆయన శుక్రవారం ప్రకటించారు.
భారతీయ విద్యార్ధులు ఆస్ట్రేలియాకు తిరిగి రావాలని తాము ఎదురుచూస్తున్నామని మోరిసన్ అన్నారు.భారత్కు చెందిన ప్రయాణీకులు ఆస్ట్రేలియాకు తిరిగి రావడానికి సహాయపడే ఇండియాలో తయారైన వ్యాక్సిన్లను తాము గుర్తించామని ఆయన చెప్పారు.
శుక్రవారం మెల్బోర్న్ నగర శివారులోని రోవిల్లేలో భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మోరిసన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా.ఆస్ట్రేలియాకు వచ్చే ప్రయాణీకుల కోసం ఇప్పటికే కోవాగ్జిన్, కోవిషీల్డ్లను ఆమోదించిన సంగతి తెలిసిందే.తమ నిర్ణయం వల్ల గడిచిన కొన్ని నెలలుగా ఆత్మీయులకు దూరమైన వారికి ప్రయోజనం చేకూరుతుందని మోరిసన్ అన్నారు.
ఆస్ట్రేలియాకు ప్రధానంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించేది పెట్టేది విద్యా రంగమే.అక్కడి విశ్వవిద్యాలయాలలో చేరిన ఆరు లక్షల మంది విదేశీ విద్యార్ధుల వల్లే ఇంతటి సంపద వస్తుంది.
విదేశీ విద్యార్ధులలో ఐదవ వంతు లేదా దాదాపు లక్ష మంది విద్యార్ధులు భారతదేశానికి చెందినవారేనని అంచనా.అంతేకాకుండా ప్రతి ఏడాది భారత్కు చెందిన నాలుగు లక్షల మంది పర్యాటకులు ఆస్ట్రేలియాను సందర్శిస్తారు.