ఇప్పుడిప్పుడే వైరస్ భయాల నుంచి ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచానికి బ్రిటన్లో వెలుగు చూసిన కొత్త రకం వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.దీంతో యూకేలో ఆదివారం నుంచి కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ‘క్రిస్మస్ బబుల్‘ పేరిట ఇచ్చిన కరోనా నిబంధనల సడలింపులను సైతం రద్దు చేస్తున్నట్టు దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.దేశవ్యాప్తంగా రెండు వారాలపాటు టైర్-4 స్థాయి ఆంక్షలు విధిస్తున్నట్టు వెల్లడించారు.
అటు బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై నెదర్లాండ్స్, బెల్జియం సహా తదితర దేశాలు నిషేధం విధించగా.మరికొన్ని ఇదే బాటలో వున్నాయి.
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు’ బ్రిటన్లో మళ్లీ లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి రావడంతో భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి.
క్రిస్మస్, నూతన సంవత్సరాలను పురస్కరించుకుని యూకేలో వున్న భారతీయులు, భారతీయ విద్యార్ధులు ఇండియాలో వున్న తమ వారి దగ్గరకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.
కొత్త రకం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యూకే నుంచి వచ్చే అన్ని విమానాలపై నిషేధాజ్ఞలు ఉండటంతో ప్రయాణాలు నిలిచిపోయాయి.దీంతో ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు.
యూకే యూనివర్సిటీలలో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులకు ప్రతి ఏటా డిసెంబర్లో క్యాంపస్ పరీక్షలు ముగుస్తాయి.దీనికి అనుగుణంగా ఇండియన్ స్టూడెంట్స్ స్వదేశం రావడానికి ఏర్పాట్లు చేసుకుంటారు.ప్రతినిత్యం అత్యంత రద్దీగా ఉండే యూకే- ఇండియా లైన్లో అప్పటికప్పుడు టికెట్లు దొరికే వీలుండదు కాబట్టి ఈ ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి.
ఆ పరిణామాల నేపథ్యంలో లండన్లోని భారత హైకమీషన్ స్పందించింది.
భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తోంది.ఈ ఏడాది కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిరిండియా.
వందే భారత్ మిషన్ కింద విమానాలను నడుపుతోంది.యూకేలో ప్రస్తుత విపత్కర పరిస్ధితుల నేపథ్యంలో వీటిని కూడా రద్దు చేసినట్లు ఎయిరిండియా తెలిపింది.డిసెంబర్ 22 రాత్రి 23.59 నిమిషాల నుంచి డిసెంబర్ 31 రాత్రి 23.59 నిమిషాల వరకు యూకే నుంచి భారత్కు, భారత్ నుంచి యూకేకు ఎలాంటి విమానాలు వుండవని వెల్లడించింది.బ్రిటన్లోని భారతీయ సమాజం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లో సురక్షితంగా వుండాలని ఎయిరిండియా సూచించింది.