అమెరికాలో స్ధిరిపడిన పలువురు భారతీయులు వివిధ రంగాల్లో దూసుకుపోతూ ఏకంగా అగ్రరాజ్యానికి ఉపాధ్యక్ష స్థానంలో నిలిచి మాతృదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.అలాగే ఆశ్రయం కల్పించిన దేశానికి ఎంతో కొంత సేవ చేస్తూ.
తమలో ఒకరిగా చూసుకుంటున్న అమెరిన్లను ప్రాణాలను పణంగా పెట్టి మరి కాపాడుతున్నారు.మొన్న కాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ భారత సంతతి సిక్కు యువకుడు ఉన్మాది కాల్పుల నుంచి సహచరులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు.
అతనికి యావత్ అమెరికా సమాజం ఘన నివాళులర్పిస్తోంది.ఇలాంటి నేపథ్యంలో వృద్ధులైన అమెరికన్లనే టార్గెట్ చేసుకుని భారీ దందాకు తెరదీసిన ఓ భారతీయుడికి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
వివరాల్లోకి వెళితే.ఢిల్లీకి చెందిన 34 ఏళ్ల హిమాన్షు అస్రీ అమెరికాలో స్ధిరపడినప్పటికీ ఇండియాలో కాల్ సెంటర్లు నిర్వహించేవాడు.వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఓ టెలిమార్కెటింగ్ పథకానికి కుట్రపన్నాడు.దీనిలో భాగంగా కంప్యూటర్ వినియోగించేవారి స్క్రీన్లపై హిమాన్షు పాప్ అప్ ప్రకటనలు ఇచ్చేవాడు.
ఎవరైనా పొరపాటున ఆ యాడ్ను క్లిక్ చేస్తే చాలు.మీ కంప్యూటర్లలో వైరస్ చొరబడిందని.
సిస్టమ్ రిపేర్ కోసం ఫలానా నంబర్కు కాల్ చేయాలని మెసేజ్ వచ్చేది.దీంతో భయపడిపోయిన వినియోగదారులు వెంటనే హిమాన్షు చెప్పిన నెంబర్కు కాల్ చేసేవారు.
అవన్నీ భారత్లో ఏర్పాటు చేసిన కాల్సెంటర్స్కు వచ్చేవి.అక్కడి సిబ్బంది ముందుగా అనుకున్న పథకం ప్రకారం.
మాల్వేర్ నుంచి రక్షణ కోసం తమ వద్ద ప్యాకెజీలు ఉన్నాయని నమ్మబలికేవారు.ఇందుకు గాను ఒక్కో వినియోగదారుడి నుంచి దాదాపు 482 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకు వసూలు చేసేవారు.
ఈ విధంగా హిమాన్షు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఐదేళ్లు విజయవంతంగా నడిచింది.ఈ కాలంలో 6,500 మందిని మోసం చేసి వారి వద్ద నుంచి రూ.6.81కోట్లు వసూలు చేశాడు.అయితే, గతేడాది హిమాన్షు పాపం పండింది.అతని కుట్ర బయటపడడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.అతనిపై నమోదైన అన్ని అభియోగాలు రుజువు కావడంతో న్యాయస్థానం డిసెంబర్లో దోషిగా తేల్చింది.తాజాగా నిన్న ఈ కేసులో న్యాయస్థానం హిమాన్షుకు శిక్షను ఖరారు చేసింది.
మూడేళ్ల జైలు శిక్షతో పాటు శిక్షాకాలం పూర్తైన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించింది.