సాధారణంగా మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, వేడుక జరిగినా, ఆ వేడుకలో కాఫీ, టీ తాగడానికి పేపర్ కప్పులు మనకు దర్శనమిస్తాయి.అంతేకాకుండా ఏ హోటల్ కి వెళ్ళిన, రైల్వే స్టేషన్ కి వెళ్ళినా ఎక్కువగా పేపర్ కప్పులలో టీ అమ్మడం మనం చూస్తూ ఉంటాం.
ఈ పేపర్ కప్పులలో టీ ని తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అంతేకాకుండా వీటివల్ల పర్యావరణ కాలుష్యం కూడా ఏర్పడుతుంది.
అయితే ఈ కాలుష్యాన్ని అరికట్టటానికి రైల్వే శాఖ మంత్రి కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.
తాజాగా వాయవ్య రైల్వేలో కొత్తగా విద్యుదీకరణ పూర్తి చేసుకున్న ధిగ్వారా-బండికుయి సెక్షన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ ఇకపై రైల్వేస్టేషన్లలో చాయ్ అమ్మే వారు ప్లాస్టిక్ కప్పులలో కాకుండా, కేవలం మట్టి పాత్రలలో అమ్మాలని ఆయన తెలియజేశారు.
కుల్హాద్గా పిలిచే మట్టి కప్పులలో చాయ్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు.
రైల్వే స్టేషన్లలో మట్టి కప్పులలో చాయ్ తాగటం వల్ల మన దేశాన్ని ప్లాస్టిక్ రహిత దేశంగా మారుతుంది.ప్లాస్టిక్ రహిత దేశంగా మారడానికి ఇండియన్ రైల్వేస్ తమవంతు కృషి చేస్తుందని ఆయన తెలిపారు.అయితే ప్రస్తుతం ఈ మట్టి కప్పులను కేవలం 400 స్టేషన్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రాబోయే రోజుల్లో ఈ మట్టి కప్పులను దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి తెలిపారు.ఈ విధంగా మట్టి కప్పులలో చాయ్ తాగడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా, ఎంతోమందికి ఈ కప్పులను తయారు చేయడం ద్వారా జీవనోపాధి కలుగుతుందని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు.