ఇండియన్ ఫొటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డు విజేత డానిష్ సిద్దిఖీ ఆఫ్ఘనిస్థాన్లో ప్రాణాలు కోల్పోయారు.ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయ్టర్స్లో ఆయన పని చేస్తున్నారు.
ఈ క్రమంలో గురువారం రాత్రి కాందహార్లో జరిగిన తాలిబన్ల దాడిలో డానిష్ మరణించారు.ఆఫ్ఘన్ స్పెషల్ ఫోర్సెస్ వెంట ఉంటూ అక్కడి తాజా పరిస్థితిని ఆయన ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిన్న రాత్రి స్పిన్ బోల్డక్లోని ప్రధాన మార్కెట్ ప్రాంతాన్ని ఆఫ్ఘన్ ప్రత్యేక దళాలు తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తాలిబన్లు ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడ్డారు.ఈ ఘటనలో సిద్దిఖీతోపాటు ఓ సీనియర్ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు.
ముంబైలో పుట్టి పెరిగిన డానిష్ సిద్ధిఖీ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో ఎకనామిక్స్లో డిగ్రీ చేశారు.అనంతరం ఏజేకే మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్లో.మాస్ కమ్యూనికేషన్ పట్టా పొందారు.2010లో రాయిటర్స్లో చేరిన సిద్ధిఖీ సంచలన వార్తలను ప్రపంచానికి అందించారు.ముఖ్యంగా మోసుల్ యుద్ధం, 2015లో నేపాల్ భూకంపం, రోహింగ్యా శరణార్థుల సమస్య, హంగ్కాంగ్ ఉద్యమం, 2020 ఢిల్లీ అల్లర్లతో పాటు దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్, యూరప్లోని కోవిడ్ పరిణామాలను వెలుగులోకి తెచ్చారు.
అయితే ఈ దాడికి మూడు రోజుల ముందే తాను సురక్షితంగా ఉన్నానంటూ సిద్దిఖీ ట్వీట్ చేశారు.కాగా 2018లో రోహింగ్యా శరణార్థుల సమస్య అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు గాను సిద్దిఖీకి ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు వరించింది.ఆయన మరణం గురించి ఆఫ్ఘనిస్థాన్లో భారత రాయబారి ఫరీద్ మాముంద్జాయ్ ట్వీట్ చేశారు.
మరోవైపై డానిష్ మరణంపై రాయిటర్స్ యాజమాన్యం స్పందించింది.ఆయన ఓ అద్భుతమైన జర్నలిస్టు, మంచి భర్త, తండ్రి, మంచి సహచరుడు అని రాయ్టర్స్ ప్రెసిడెంట్ మైకేల్ ఫ్రైడెన్బెర్గ్, ఎడిటర్ ఇన్ చీఫ్ అలెజాండ్రా గాలోని ఒక ప్రకటనలో అన్నారు.
ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో సిద్దిఖీ కుటుంబానికి తాము అండగా ఉంటాం అని ఆయన తెలిపారు.
కాగా, ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్తుండటంతో అంతకుముందు అక్కడి ఇండియన్ కాన్సులేట్లోని 50 మంది అధికారులు, దౌత్యవేత్తలను భారత ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.