ప్రపంచవ్యాప్తంగా మహిళల ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి రొమ్ము క్యాన్సర్.దీని బారినపడి ప్రతి యేటా లక్షల మంది మరణిస్తున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.
ప్రపంచం సంగతి ఏమో కానీ భారత్, పాకిస్తాన్కు చెందిన మహిళలు చిన్న వయసులోనే తీవ్రమైన రొమ్ము కాన్సర్ బారినపడుతున్నారట.అమెరికన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సర్వేలైన్స్ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం తేలింది.
ఎపిడెమియాలజీ అండ్ ఎండ్ రిజల్ట్ ప్రొగ్రామ్లో భాగంగా భారత్- పాకిస్తాన్, ఆంగ్లో- అమెరికన్లపై ఈ సర్వే ప్రధానంగా సాగింది.సర్వేలో వెలుగు చూసిన పలు అంశాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ లో ప్రచురించారు పరిశోధకులు.
1990 నుంచి 2014 వరకు ఉన్న డేటా ఆధారంగా పరిశోధన జరిగినట్లు సెంటర్ ఫర్ సౌత్ ఏషియన్ క్వాంటిటేటివ్ హెల్త్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జయా సతగోపన్ తెలిపారు.ఇందులో 4,900 మంది భారతీయ- పాకిస్థానీ మహిళలు, ఆంగ్లో అమెరికన్లు సుమారు ఐదు లక్షల వరకు పాల్గొన్నారు.
ఇండియన్, పాకిస్తానీ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వివిధ రూపాల్లో వ్యాపిస్తోందని రిసెర్చర్లు తేల్చారు.దాని తీవ్రత కూడా ఎక్కువగా ఉందని తెలిపారు.రట్జర్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, రట్జర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూజెర్సీ సంస్థలకు చెందిన నిపుణులు ఈ పరిశోధనలు చేశారు.
ఇందులో నాన్ హిస్పానిక్ తెల్ల జాతి మహిళల కంటే ఇండియన్, పాకిస్తానీ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వ్యాప్తి తక్కువగా ఉందని కనుగొన్నారు.కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ జనాభాలో వ్యాధి వ్యాప్తి క్రమంగా పెరుగుతోందని వారు గుర్తించారు.రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఇండియన్, పాకిస్తానీ మహిళలల్లో చిన్న వయస్సులో కూడా అడ్వాన్డ్స్ స్టేజ్లోనే వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది.
నాన్ హిస్పానిక్ తెల్ల జాతి మహిళలతో పోలిస్తే, దాయాది దేశాల మహిళలు రొమ్ము క్యాన్సర్తో చనిపోయే ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.కానీ అధ్యయనం కోసం వారి హెల్త్ డేటాను చాలా తక్కువ సమయానికి ట్రాక్ చేశారు.
చాలా తక్కువ మంది ఇండియన్, పాకిస్తానీ మహిళలు శాస్త్రీయ అధ్యయనాలలో పాల్గొంటున్నారని గతంలో చేసిన క్యాన్సర్ పరిశోధనల్లో తేలింది.సామాజిక, సాంస్కృతిక కారణాల వల్ల వారు అనారోగ్యాల గురించి బయటకు చెప్పకపోవడం, మామోగ్రామ్ స్క్రీనింగ్ చేయించుకోకపోవడం, కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడం, భయం, నమ్మకాలు, యూఎస్లో పదేళ్ల కంటే తక్కువగా నివసించడం, ఇంగ్లీష్ తెలియకపోవడం, ఆరోగ్య వ్యవస్థలపై నమ్మకం లేకపోవడం వంటి కారణాల వల్ల వైద్య పరీక్షలకు చాలామంది దూరంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారుఅమెరికాలో, ముఖ్యంగా న్యూజెర్సీలో దక్షిణాసియా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో… క్యాన్సర్ నివారణ, స్క్రీనింగ్, రోగ నిర్ధారణ, చికిత్స కోసం అవగాహన కార్యక్రమాలు, టీం సైన్స్ విధానం ద్వారా హెల్త్ ఈక్విటీని ప్రోత్సహించేందుకు తాము కృషి చేయాల్సిన అవసరం ఉందని అధ్యయన బృందంలో మరో సభ్యురాలైన అనితా కిన్నే అన్నారు.