మనదగ్గర పనిచేసే వారికి కూడు, గూడు, గుడ్డ అందించడంతో పాటు ఆపదలో ఆదుకున్న యజమానులను ఎంతోమందిని చూశాం.పనివాళ్లకు ఇళ్లు కూడా ఇళ్లు కట్టించిన వారిని చూశాం.
కానీ ఓ భారతీయ మహిళ పనిమనిషిని చిత్రహింసలు గురిచేసి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైంది.సంచలనం కలిగించిన ఈ కేసులో నిందితురాలికి 30 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సింగపూర్ కోర్ట్ తుది తీర్పును వెలువరించింది.
వివరాల్లోకి వెళితే.సింగపూర్లో స్థిరపడిన గాయత్రి మురుగయాన్ అనే భారత సంతతికి చెందిన మహిళ ఇంట్లో మయన్మార్కు చెందిన పియాంగ్ అనే మహిళ పనిచేస్తోంది.ఆమె ఇటీవల మెదడుకు గాయమై ప్రాణాలు కోల్పోయింది.అయితే ఆమెను తీవ్రంగా హింసించడం, కొట్టడం, తిండిపెట్టకపోవడం కారణంగానే పియాంగ్ మరణించినట్టు పోస్ట్మార్టం నివేదికలు చెబుతున్నాయి.
మృతురాలి శరీరంపై 50కు పైగా గాయాలు ఉన్నట్టు పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారా తెలిసింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు తెలిశాయి.
గాయత్రి .పియాంగ్కు కనీసం భోజనం కూడా పెట్టకుండా ఆమెను చిత్రహింసలు పెడుతూ వచ్చినట్టు తేలింది.పియాంగ్తో వెట్టిచాకిరీ చేయించుకుని, ఆమెకు తిండి పెట్టకుండా గాయత్రి నరకం చూపించింది.అంతేకాకుండా తనకు తెలియకుండా ఆమె ఎక్కడ భోజనం చేస్తుందేమోనని పియాంగ్ను కిటికీకి కట్టేసి రాక్షసానందం పొందింది.
ఈ నేపథ్యంలో పియాంగ్ మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలు విడిచింది.చివరికి ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు కూడా ఆ స్థితిలో కన్నీటికి గురయ్యారంటే గాయత్రి ఏ స్థాయిలో వేధించిందో అర్ధం చేసుకోవచ్చు.
మరోవైపు తిండి పెట్టకపోవడం వల్ల పియాంగ్ బాగా కృశించిపోయింది.మరణించే సమయానికి ఆమె బరువు కేవలం 24 కేజీలే అని డాక్టర్లు తెలిపారు.
ఒకవేళ మెదడుకు గాయం కాకపోయినా శరీరంలో పోషక స్థితి క్షీణించడం వల్ల పియాంగ్ కొద్దిరోజుల్లోనే మరణించి ఉండేదని డాక్టర్లు వెల్లడించారు.ఈ కేసులో పోలీసులు గాయత్రిని అదుపులోకి తీసుకుని పలు అభియోగాలు మోపారు.
విచారణలో భాగంగా పియాంగ్పై దాడి చేసింది తానేనని, ఆమె మరణానికి కారణం తానేనంటూ గాయత్రి కోర్టులో నేరాన్ని అంగీకరించింది.
14 నెలల ఒప్పందంపై మే 2015లో గాయత్రి ఇంటిలో పనిచేయడానికి సింగపూర్ వచ్చింది.అయితే కనీస కనికరం లేకుండా గాయత్రి ఆమెను చిత్రహింసలకు గురిచేసింది.చీపురు, ఇనుప వస్తువులతో పియాంగ్ను గాయత్రి తీవ్రంగా కొట్టింది.
ఒకానొక సందర్భంలో పియాంగ్ జుట్టును పట్టుకుని లాగడంతో ఆమె తల వెంట్రుకలు కుదుళ్లతో సహా ఊడివచ్చేశాయి.అక్కడితో ఆగకుండా ఇనుప వస్తువును కాల్చి ఆమె చేతిపై గాయత్రి వాతలు పెట్టింది.
గాయత్రి నేరాలపై మంగళవారం తుది తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సీ కీ వూన్ ఇలా వ్యాఖ్యానించారు.బాధితురాలు హింసకు, అవమానాలకు గురవ్వడంతో పాటు ఆకలితో అల్లాడిపోయి చివరికి నిందితుల చేతిలో మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితుల క్రూరత్వాన్ని చెప్పడానికి తన వద్ద పదాలు కూడా లేవని న్యాయమూర్తి అన్నారు.ఇదే కేసులో గాయత్రి భర్త కెవిన్ చెల్వం.పియాంగ్పై దాడి ఘటనకు సంబంధించి ఫ్లాట్లోని సీసీటీవీ కెమెరాలను, ఫుటేజ్లను తొలగించినట్లు పోలీసులకు అబద్ధం చెప్పడం సహా ఐదు ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.గాయత్రి తల్లి ప్రేమా నారాయణ స్వామిపై కూడా పలు ఆరోపణలు వున్నట్లుగా స్థానిక ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది
.