కూతురితో కలిసి పనిమనిషిని చిత్రహింసలు పెట్టి ఆమె మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ కోర్ట్ సోమవారం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.నిందితురాలిని 64 ఏళ్ల ప్రేమ ఎస్ నారాయణ స్వామిగా గుర్తించారు.
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి తోహ్ హన్ లీ ఈ మేరకు తీర్పు వెలువరించారు.ఆమె బాధితురాలిపై స్వయంగా లేదా ఆమె కుమార్తె గయ్యాతిరి మురుగయన్తో కలిసి దాడి చేసిందని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది.
ఆమె 48 అభియోగాలను అంగీకరించారు.పనిమనిషి పియాంగ్ కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
14 నెలల వేధింపుల తర్వాత .జూలై, 2016న మెడకు తీవ్రగాయం వల్ల మెదడు పనితీరులో ఇబ్బందుల కారణంగా పియాంగ్ ప్రాణాలు కోల్పోయింది.ఇంట్లో ఆమెను ప్రేమ ఎస్ నారాయణస్వామి సైతం తీవ్రంగా వేధించినట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించినట్లు ఛానెల్ న్యూస్ ఏషియా నివేదించింది.తన కుమార్తె పనిమనిషిని శారీరీకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న విషయం తెలుసుకుని, అది తప్పని చెప్పాల్సిందిపోయి.
ఆమెను తాను కూడా చిత్రహింసలకు గురిచేసింది.పియాంగ్పై నీళ్లు పోసి తన్నడం, చెంపదెబ్బలు కొట్టడంతో పాటు మెడ పట్టుకుని తోయడం, జుట్టుతో లాగడం వంటి చర్యలకు పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజ్లో తేలింది.
కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.సింగపూర్లో స్థిరపడిన గాయత్రి మురుగయాన్ అనే భారత సంతతికి చెందిన మహిళ ఇంట్లో మయన్మార్కు చెందిన పియాంగ్ అనే మహిళ పనిచేస్తోంది.ఆమె ఇటీవల మెదడుకు గాయమై ప్రాణాలు కోల్పోయింది.అయితే ఆమెను తీవ్రంగా హింసించడం, కొట్టడం, తిండిపెట్టకపోవడం కారణంగానే పియాంగ్ మరణించినట్టు పోస్ట్మార్టం నివేదికలు చెబుతున్నాయి.మృతురాలి శరీరంపై 50కు పైగా గాయాలు ఉన్నట్టు పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారా తెలిసింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు తెలిశాయి.
గాయత్రి .పియాంగ్కు కనీసం భోజనం కూడా పెట్టకుండా ఆమెను చిత్రహింసలు పెడుతూ వచ్చినట్టు తేలింది.పియాంగ్తో వెట్టిచాకిరీ చేయించుకుని, ఆమెకు తిండి పెట్టకుండా గాయత్రి నరకం చూపించింది.అంతేకాకుండా తనకు తెలియకుండా ఆమె ఎక్కడ భోజనం చేస్తుందేమోనని పియాంగ్ను కిటికీకి కట్టేసి రాక్షసానందం పొందింది.
ఈ నేపథ్యంలో పియాంగ్ మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలు విడిచింది.చివరికి ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు కూడా కన్నీటికి పర్యంతమయ్యారంటే గాయత్రి ఏ స్థాయిలో వేధించిందో అర్ధం చేసుకోవచ్చు.
మరోవైపు తిండి పెట్టకపోవడం వల్ల పియాంగ్ బాగా కృశించిపోయింది.మరణించే సమయానికి ఆమె బరువు కేవలం 24 కేజీలే అని డాక్టర్లు తెలిపారు.ఒకవేళ మెదడుకు గాయం కాకపోయినా శరీరంలో పోషక స్థితి క్షీణించడం వల్ల పియాంగ్ కొద్దిరోజుల్లోనే మరణించి ఉండేదని డాక్టర్లు వెల్లడించారు.ఈ కేసులో పోలీసులు గాయత్రిని అదుపులోకి తీసుకుని పలు అభియోగాలు మోపారు.
విచారణలో భాగంగా పియాంగ్పై దాడి చేసింది తానేనని, ఆమె మరణానికి కారణం తానేనంటూ గాయత్రి కోర్టులో నేరాన్ని అంగీకరించింది.
కాగా.14 నెలల ఒప్పందంపై మే 2015లో గాయత్రి ఇంటిలో పనిచేయడానికి పియాంగ్ సింగపూర్ వచ్చింది.అయితే కనీస కనికరం లేకుండా గాయత్రి ఆమెను చిత్రహింసలకు గురిచేసింది.
చీపురు, ఇనుప వస్తువులతో పియాంగ్ను గాయత్రి తీవ్రంగా కొట్టింది.ఒకానొక సందర్భంలో పియాంగ్ జుట్టును పట్టుకుని లాగడంతో ఆమె తల వెంట్రుకలు కుదుళ్లతో సహా ఊడివచ్చేశాయి.
అక్కడితో ఆగకుండా ఇనుప వస్తువును కాల్చి ఆమె చేతిపై గాయత్రి వాతలు పెట్టింది.సంచలనం కలిగించిన ఈ కేసులో నిందితురాలికి 30 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సింగపూర్ కోర్ట్ 2021 జూన్ 23న తుది తీర్పును వెలువరించింది.