అమెరికా ప్రతినిధుల సభలో సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తిలకు అరుదైన గౌరవం దక్కింది.బడ్జెట్, కరోనా వైరస్లకు సంబంధించిన కాంగ్రెస్ కమిటీలలో సభ్యులుగా నియమిస్తూ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆదేశాలు జారీ చేశారు.
శక్తివంతమైన బడ్జెట్ కమిటీకి ప్రమీలా జయపాల్ (55)ను, కోవిడ్ సంక్షోభం నిమిత్తం ఏర్పాటైన కమిటీకి రాజా కృష్ణమూర్తి (47)ని పెలోసి ఎంపిక చేశారు.కరోనా వైరస్ను ఎదుర్కోవడంతో పాటు ప్రభుత్వం ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ ఉప సంఘం సూచనలు అందజేస్తుంది.
తనను ఈ కమిటీలో నియమించినందుకు గాను రాజా కృష్ణమూర్తి స్పీకర్కు కృతజ్ఞతలు తెలియజేశారు.కోవిడ్ మహమ్మారిని ఓడించి, ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టడం, అమెరికన్ల ఆరోగ్యం, ప్రజల భద్రతను కాపాడటానికి ఈ ప్యానెల్ ఛైర్మన్ క్లైబర్న్, తన సహచరులతో కలిసి పనిచేయడం గౌరవంగా వుందని కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.2017 నుంచి ఇల్లినాయిస్ 8వ కాంగ్రెస్ జిల్లాకు రాజా కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ప్యానెల్లోని రెండు పార్టీల ప్రతినిధులతో కలసి పని చేసేందుకు తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు.
అంతేకాకుండా కోట్లాది మంది పన్ను చెల్లింపుదారుల నుంచి ఖజానాకు లభిస్తున్న నిధులను సమర్థవంతంగా, పారదర్శకంగా కోవిడ్ను ఎదుర్కోవడానికి ఉపయోగిస్తామన్నారు.
2017 నుంచి వాషింగ్టన్ 7వ కాంగ్రెస్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రమీలా జయపాల్ బడ్జెట్ ఆమోదంలో కీలకపాత్ర పోషిస్తున్న హౌస్ బడ్జెట్ కమిటికీ సభ్యురాలిగా ఎంపికయ్యారు.ఈ కమిటీకి జాన్ యర్మూత్ అధ్యక్షత వహిస్తారు.అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన మొదటి భారతీయ అమెరికన్ మహిళగా జయపాల్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
దేశంలోని కార్మికులు తమ శ్రమకు ప్రతిఫలంగా గంటకు 15 డాలర్లను కనీస వేతనంగా అందుకోవాలనే ఉద్దేశ్యంతో జయపాల్ పనిచేస్తున్నారు.కాగా, అమెరికాలో కోవిడ్ కారణంగా గతేడాది 4,20,000 మంది ప్రాణాలు కోల్పోగా.25 లక్షలకు పైగా దీని బారినపడ్డారు.దీంతో అమెరికన్లను, దేశ ఆర్ధిక వ్యవస్థను ఆదుకోవడానికి కొత్త అధ్యక్షుడు జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల రెస్క్యూ ప్యాకేజీని ప్రతిపాధించారు.దీని ద్వారా అమెరికన్లకు నిరుద్యోగ భృతి అందించడంతో పాటు తీవ్రమైన ఆర్ధిక కష్టాల్లో ఉన్న రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలను ఆదుకోవాలని బైడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.