అక్రమ వలసలకు సంబంధించి యూకే హోమ్ సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఇంగ్లీష్ ఛానెల్ మీదుగా చట్టవిరుద్ధంగా యూకే సరిహద్దుకు చేరుకోవడానికి ప్రయత్నించిన నలుగురు అక్రమ వలసదారులు మరణించిన విషయంపై సుయెల్లా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో మానవ అక్రమ రవాణా ముఠాలను నాశనం చేస్తామని ఆమె ప్రతిజ్ఞ చేశారు.ఈ మేరకు హౌస్ ఆఫ్ కామన్స్లో సుయెల్లా బ్రేవర్మాన్ ప్రకటన చేశారు.
ఇంగ్లీష్ ఛానెల్ దాటడం అనేది ప్రాణాంతకమైన ప్రయత్నం అన్నారు.అన్నింటికీ మించి మనుషులను కార్గో మాదిరిగా చూసే స్మగ్లర్లు, దుర్మార్గులు, వ్యవస్ధీకృత నేరస్థుల వ్యాపారాలను నాశనం చేస్తామని సుయెల్లా స్పష్టం చేశారు.
అటు అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం స్పందించారు.వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఐదంచెల వ్యూహాన్ని అనుసరించాలని ఆయన భావిస్తున్నారు.ఇంగ్లీష్ ఛానెల్ను అక్రమంగా దాటేందుకు ప్రయత్నించే చిన్న చిన్న బోట్లపై నిఘా పెట్టేందుకు ప్రత్యేకంగా కొత్త యూనిట్ను ఏర్పాటు చేస్తామని, ఇందులో 700 మంది సిబ్బంది వుంటారని రిషి సునాక్ పేర్కొన్నారు.అలాగే ఇమ్మిగ్రేషన్ నేరాలను అడ్డుకోవడానికి బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్సీఏ)కి నిధులు పెంచుతామని ప్రధాని వెల్లడించారు.
యూకేలో ఆశ్రయం కోరుతూ వచ్చిన దరఖాస్తులన్నింటినీ వచ్చే ఏడాది చివరికల్లా పరిష్కరిస్తామని రిషి సునాక్ హామీ ఇచ్చారు.కల్లోల పరిస్ధితులు లేని, భద్రత కలిగిన దేశాలకు చెందిన వారు కూడా బ్రిటన్కు రావడం సరికాదని ఆయన హితవు పలికారు.కాగా.అత్యంత శీతల వాతావరణ పరిస్ధితుల మధ్య అక్రమ వలసదారులకు చెందిన పడవ ఇంగ్లీష్ ఛానెల్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే.వీరిని రక్షించడానికి బుధవారం తెల్లవారుజామున బ్రిటీష్ సహాయక బృందాలు ఆపరేషన్ నిర్వహించి 43 మందిని రక్షించాయి.