2021లో బ్రిటన్ రాజసౌధం విండ్సర్ కాజిల్లోకి చొరబడి దివంగత క్వీన్ ఎలిజబెత్ 2ను చంపేందుకు ప్రయత్నించిన భారత సంతతికి చెందిన యువకుడు తాను దేశద్రోహానికి పాల్పడినట్లు అంగీకరించాడు.జస్వంత్ సింగ్ ఛాయిల్ అనే యువకుడు 2021 క్రిస్మస్ రోజున రాజ నివాసంలో క్వీన్ ఎలిజబెత్ను చంపాలని నిర్ణయించుకున్నాడు.నిందితుడిపై ఇప్పటికే రాజద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు.1981 నుంచి యూకేలో రాజద్రోహానికి పాల్పడిన తొలి వ్యక్తి జస్వంతే.ఇతనిని ఇంగ్లాండ్లోని బ్రాడ్మూర్ హాస్పిటల్ నుంచి శుక్రవారం వీడియో లింక్ ద్వారా లండన్లోని ఓల్డ్ బెయిలీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.విక్టోరియా మహారాణి హయాంలో ఒక వ్యక్తి ఆమెపై పిస్టల్తో గురిపెట్టడంతో 1842లో దేశద్రోహ చట్టం అమల్లోకి వచ్చింది.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మాయని మచ్చగా మిగిలిపోయిన జలియన్ వాలాబాగ్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకోవాలని సౌతాంప్టన్ కు చెందిన ఛాయిల్ నిర్ణయించుకున్నాడు .విండ్సర్ కాజిల్ లో అడుగు పెట్టడానికి ముందు జలియన్వాలా బాగ్ మారణకాండకు ప్రతీకారంగానే తాను క్వీన్ ఎలిజబెత్ను హత్య చేయాలనుకున్నట్లు ఆ యువకుడు చెప్పాడు.తన పేరు జస్వంత్ సింగ్ ఛాయిల్ అని, తాను భారతీయ సిక్కునని వివరిస్తూ స్నాప్చాట్లో వీడియో పోస్ట్ చేశాడు.జాతి పేరుతో వివక్షకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు, అవమానాలకు గురైనవారి తరఫున ప్రతీకారం తీర్చుకుంటానని జస్వంత్ అన్నాడు.
ఈ సమయంలో యువకుడు ముసుగు ధరించి.చేతిలో విల్లువంటి క్రాస్బౌ ఆయుధాన్ని పట్టుకున్నాడు.అంతర్జాతీయ దినపత్రిక న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.భారతీయుల పట్ల గతంలో బ్రిటీష్ పాలకులు అనుసరించిన వైఖరిపై జస్వంత్ అసహనానికి గురైనట్లుగా లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ ఫోర్స్ విచారణలో తేలింది.
సోషల్ మీడియాలో జస్వంత్ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.అయితే రాణి నివాసం వరకు వెళ్లేలోపే భద్రతా సిబ్బంది అతనిని పట్టుకున్నారు.అలాగే సౌతాంప్టన్ ప్రాంతంలో అతని ఇంటికి వెళ్లి సోదాలు జరిపి
మరో క్రాస్బౌ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.అయితే జస్వంత్ మానసిక పరిస్ధితిపై అనుమానాలు రావడంతో అతనిని పోలీసులు మానసిక వైద్యుల పర్యవేక్షణలో వుంచారు.ఈ కేసుకు సంబంధించి గతేడాది ఆగస్ట్ 17న లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో నిందితుడిని హాజరు పరిచారు.ఛాయిల్ పై 1842 దేశద్రోహ చట్టంలోని సెక్షన్ 2 కింద నేరారోపణలు మోపారు.
ఆయుధాలను విడుదల చేయడం లేదా గురిపెట్టడం ద్వారా రాజు లేదా రాణిని ఉద్దేశ్యపూర్వకంగా గాయపరచాలని అనుకోవడం కింద అభియోగాలను నమోదు చేశారు.