భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.68 లక్షల మంది కోవిడ్ బారినపడ్డారు.అలాగే వైరస్ వల్ల 3,417 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు దేశంలో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి.ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా పెరుగుతున్న కేసులతో అవి ఏ మూలకు సరిపోవడం లేదు.
వీటికి తోడు ఆక్సిజన్, మందులు, వైద్య సామాగ్రి కొరత భారతీయ వైద్య రంగాన్ని ఇబ్బంది పెడుతోంది.డాక్టర్లు, వైద్య సిబ్బంది సైతం రోగుల్ని రక్షించేందుకు గాను తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇదే సమయంలో ఈ మహమ్మారి బారినపడి ఎంతోమంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు.పరిస్ధితి ఇలాగే కొనసాగితే దేశ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అటు ప్రభుత్వం సైతం ఆసుపత్రులపై భారాన్ని తగ్గించేందుకు గాను టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.వైరస్ బారినపడిన ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి రానక్కర్లేదని.
హోం ఐసోలేషన్లో వుంటూ చికిత్స తీసుకోవచ్చని సూచిస్తోంది.ఫోన్, వీడియో కాల్ ద్వారా హోం ఐసోలేషన్లో వున్న వారికి సలహాలు, సూచనలు ఇచ్చేలా ఏర్పాట్లు ఇస్తోంది.
మరోవైపు భారత్లోని పరిస్థితుల నేపథ్యంలో తమ జన్మభూమికి సాయం చేసేందుకు గాను పలు దేశాల్లో వైద్యులుగా స్థిరపడిన ప్రవాస భారతీయులు ముందుకొస్తున్నారు.ఈ క్రమంలో యూకేలోని బ్రిటన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (బీఏపీఐఓ) వైద్యులు ఓ బృందంగా ఏర్పడి టెలీ మెడిసిన్ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ‘‘గో ఫండ్ మీ’’ ద్వారా దాదాపు 1,08,000 పౌండ్ల నిధులను సేకరించింది ఈ బృందం.వీటిని అక్షయపాత్ర ఫౌండేషన్కు అందజేసిన బీఏపీఐఓ.అవసరమైన వారికి ఆహారం అందించాలని కోరింది.ఇక వీరి టెలీ మెడిసిన్ ప్రాజెక్ట్ కోసం యూకే జనరల్ మెడిసిన్ కౌన్సిల్ (జీఎంసీ) మద్ధతు కూడా లభించింది.
తొలుత ప్రయోగాత్మకంగా నాగ్పూర్లోని ఆసుపత్రులతో కలిసి టెలీ కన్సల్టింగ్ను ప్రారంభించనుంది.
మరోవైపు దేశంలోని వైద్యులపై భారాన్ని తగ్గించడంతో పాటు వైద్య సేవలను అందరికీ అందించేందుకు గాను కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్ధులను ఆరోగ్య సేవల కోసం వినియోగించుకోవాలని యోచిస్తోంది.ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం చదువుతున్న వారితో పాటు పాటు ఎంబీబీఎస్ నర్సింగ్లో ఉత్తీర్ణులైన వారిని కూడా అనుమతించాలని కేంద్రం భావిస్తోంది.