ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్పై పోరులో భారత సంతతి వైద్యులది కీలకపాత్ర.భారతదేశంతో పాటు వివిధ దేశాల్లోని వైద్య రంగానికి మనవారు వెన్నెముకలా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే పలువురు భారతీయ డాక్టర్లు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా.మరికొందరు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న భారత సంతతికి చెందిన వైద్యుడు యూకేలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం సంచలనం కలిగించింది.డాక్టర్ రాజేశ్ గుప్తా అనే భారతీయుడు ఆగ్నేయ ఇంగ్లాండ్లోని బెర్క్షైర్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న వెక్షం పార్క్ హాస్పిటల్లో అనస్థీషియన్ కన్సల్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రస్తుతం బ్రిటన్ను కోవిడ్ 19 గడగడలాడిస్తుండటంతో రాజేశ్.కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు.అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాను పనిచేసే ఆసుపత్రికి దగ్గరలోని ఓ హోటల్లో రాజేశ్ ఒక్కరే నివసిస్తున్నారు.ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం ఆయన బస చేస్తున్న హోటల్ గదిలోనే శవమై తేలాడు.
ఇందుకు సంబంధించి ఫ్రిమ్లీ హెల్త్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
మధ్యాహ్నం వరకు కరోనా రోగులకు చికిత్స అందించిన రాజేశ్ .విధులు ముగించుకుని హోటల్కు వెళ్లారని , ఆ తర్వాతే ఆయన మరణించారని ట్రస్ట్ వెల్లడించింది.ఆయనలో డాక్టర్తో పాటు కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్, చెఫ్ ఉన్నారని మానవత్వానికి ప్రతీక లాంటి వ్యక్తిని కోల్పోయామని ఫ్రిమ్లీ హెల్త్ ఓ ప్రకటనలో తెలిపింది.భారతదేశంలోని జమ్మూకాశ్మీర్కు చెందిన రాజేశ్ గుప్తా 1997లో జమ్మూ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసించారు.2006లో యూకేకు వలస వెళ్లిన రాజేశ్ అక్కడే స్థిరపడ్డారు.ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.కాగా రాజేశ్ మరణానికి దారితీసిన కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.