ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఉద్యోగులకు వేతనాలు, ఇతర భత్యాలు కట్ చేయొచ్చా అని ఎదురుచూసే కంపెనీలు ఉన్న ఈ రోజుల్లో తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు వారి భార్యలకు కూడా వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఆయా దేశాలు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
దీని వల్ల ఎన్నో సంస్థలు మూతపడటంతో కోట్లాది మంది రోడ్డున పడ్డారు.
కోవిడ్ కాస్త నిదానించడంతో దశల వారీగా లాక్డౌన్ను ఎత్తివేస్తున్నాయి ప్రభుత్వాలు.
అయితే వ్యాపారాలు సరిగా సాగడం లేదనే వంకతో పలు కంపెనీలు ఇంకా వేతనాలను పూర్తి స్థాయిలో చెల్లించడంలేదు.కొన్ని సంస్థలు కాస్ట్ కాటింగ్ పేరిట తమ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి.
ఇలాంటి పరిస్ధితుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వ్యాపార వేత్త డాక్టర్ సోహన్ రాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.కరోనా సంక్షోభ సమయంలో నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసిన ఉద్యోగులతోపాటు వారి భార్యలకు కూడా వేతనాలు చెల్లించడానికి ముందుకు వచ్చారు.
సోహన్ రాయ్.షార్జా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎరైజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రమోటర్గా ఉన్నారు.
కరోనా సమయంలోనూ నిబద్ధత ప్రదర్శించిన ఉద్యోగుల భార్యలకు రెగ్యులర్ వేతనాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఈ మేరకు ఖలీజ్ టైమ్స్ వార్త సంస్థ కథనాన్ని ప్రచురించింది.
సోహన్ రాయ్ కంపెనీ అధికారులు ప్రస్తుతం తమ సంస్థలో పని చేస్తున్న పురుష ఉద్యోగుల డేటా బేస్ సేకరణలో నిమగ్నమయ్యారు.సదరు ఉద్యోగులు పని చేసిన సంవత్సరాలను బట్టి వారి భార్యలకు వేతనాలను చెల్లించనున్నారు.
కేరళకు చెందిన సోహన్ రాయ్.షార్జాలో మేషం గ్రూప్ సంస్థలను నెలకొల్పి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు.ఫోర్బ్స్ 2017లో విడుదల చేసిన మిడిల్ ఈస్ట్ ఇన్ఫ్లూయెన్స్డ్ లీడర్ల జాబితాలోనూ ఆయన చోటు దక్కించుకున్నారు.అయితే, ఉద్యోగుల భార్యలకూ జీతాలు ఇవ్వడానికి రాయ్ ఒక కారణం చెబుతున్నారు.
ఓ గృహిణి చేసే పని విలువ ఆమె భర్త కంటే తక్కువ ఏం కాదంటూ ఓ కేసు విచారణ సందర్భంగా భారత సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.కోవిడ్ సంక్షోభ సమయంలో ఉద్యోగులు నిబద్ధతతో పని చేయడానికి వారి జీవిత భాగస్వాములు కూడా కారణం అని రాయ్ బలంగా నమ్ముతున్నారు.
అందుకే వారికి సైతం అండగా నిలవాలని నిర్ణయించారు.