సింగపూర్లో ఓ భారత సంతతి యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్లో ఉగ్ర దాడుల వార్షికోత్సవం సందర్భంగా మార్చిలో రెండు మసీదులపై దాడులు చేసేందుకు ఆ యువకుడు కుట్ర పన్నినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
అన్నట్లు ఆ కుర్రాడి వయసు ఎంతో తెలుసా 16 ఏళ్లు.ప్రొటెస్టంట్ క్రైస్తవ వర్గానికి చెందిన ఈ యువకుడు రెండు మసీదుల్లో ముస్లింలపై దాడి చేయడానికి కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో అతనిని సింగపూర్ పోలీసులు అంతర్గత భద్రతా చట్టం (ఐఎస్ఏ) కింద అదుపులోకి తీసుకున్నారు.
దీని కింద అరెస్ట్ కాబడిన పిన్న వయస్కుడిగా ఈ కుర్రాడు నిలిచాడని అంతర్గత భద్రతా విభాగం తెలిపింది.అంతేకాకుండా సింగపూర్లో ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడై అరెస్ట్ అయిన యువకుడిగా ఈ కుర్రాడు నిలిచాడు. 2019 మార్చిలో న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్లో వున్న రెండు మసీదులపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 59 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ దాడి ఘటన నిందితుడి మనసులో బలంగా నాటుకుపోయిందని స్థానిక మీడియా కథనాన్ని ప్రచురించింది.
రాడికల్ భావజాలం వున్న ఈ యువకుడు, ఇస్లాంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది.అంతేకాకుండా మధ్యప్రాచ్యంలో రక్తపు టేరులు పారించిన ఇస్లామిక్ స్టేట్ వీడియోలను చూసేవాడని, ఇస్లాంను నమ్మని వారిని కొందరు ముస్లింలు చంపుతున్నారని అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఇస్లాం పట్ల తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్న ఈ భారత సంతతి యువకుడు సింగపూర్లోని తన ఇంటికి సమీపంలో వున్న అస్సియాఫా మసీదు, యూసోఫ్ ఇషాక్ మసీదులను దాడికి ఎంచుకున్నాడు.దాడులు నిర్వహించేందుకు గాను గూగుల్ మ్యాప్స్, స్ట్రీట్ వ్యూను ఉపయోగించి ఆ మసీదులపై రెక్కీ నిర్వహించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.కత్తితో దాడి చేయాలని భావించిన అతను ఇందుకు సంబంధించి యూట్యూబ్ వీడియోలను వీక్షించాడు.కత్తి కంటే ముందు క్రైస్ట్చర్చ్ దాడి నిందితుడు టారెంట్ ఉపయోగించిన మాదిరి రైఫిల్ను వాడాలని భావించాడు.
అలాగే ట్రైయాసెటోన్ ట్రిపెరాక్సైడ్ (టీఏటీపీ) బాంబు, గ్యాసోలిన్ ఉపయోగించి మసీదులకు నిప్పు పెట్టేందుకు గూగుల్లో సెర్చ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.