భార్యను, ముగ్గురు పిల్లలను దారుణంగా హత్య చేసిన కేసులో భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు అమెరికా కోర్ట్ జీవిత ఖైదు విధించింది.శంకర్ నాగప్ప హంగుడ్ అనే ఇండో అమెరికన్ 2019లో తన భార్య, ముగ్గురు పిల్లలను హత్య చేసినట్లు అంగీకరించడంతో కోర్ట్ అతనికి పెరోల్ లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
కాలిఫోర్నియాలోని తన అపార్ట్మెంట్లోనే శంకర్ (55) ఈ హత్యలకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు.ప్లేసర్ కౌంటీలో శిక్ష విధించే సమయంలో దీనిపై నిందితుడు మౌనంగా ఉండిపోయినట్లు అమెరికన్ మీడియా కథనాలను ప్రచురించింది.
హత్యల అనంతరం రోజ్విల్లేకు ఉత్తరాన 320 కిలోమీటర్ల దూరంలో వున్న మౌంట్ శాస్తా పోలీసులకు జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు.దీంతో అప్పట్లో అమెరికా మీడియా సంస్థలు ఆయన గురించి విస్తృతంగా కథనాలను ప్రసారం చేశాయి.
శంకర్ చెప్పిన సమాచారం ఆధారంగా రోజ్విల్లే పోలీసులు జంక్షన్ రోడ్లోని అతని అపార్ట్మెంట్లో ఒక మహిళ, ఇద్దరు పిల్లల మృతదేహాలను కనుగొన్నారు.శంకర్ కుమారుడి మృతదేహాన్ని మౌంట్ శాస్తాలోని పోలీస్ స్టేషన్ వెలుపల పార్క్ చేసిన నిందితుడి కారులో కనుగొన్నారు.
వారం రోజుల పాటు నిందితుడి మారణకాండ నడిచిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.తొలుత జంక్షన్ బౌలేవార్డ్లోని వుడ్ క్రీక్ వెస్ట్ కాంప్లెక్స్లోని రోజ్విల్లే అపార్ట్మెంట్లో 2019 అక్టోబర్ 7న అతని భార్య, కుమార్తె, చిన్న కొడుకును హత్య చేశాడు.ఆ తర్వాత తన పెద్దకొడుకుని రోజ్విల్లే- మౌంట్ శాస్తా మధ్య ఎక్కడో చంపాడు.అనంతరం అతని కొడుకు మృతదేహంతో సహా అక్టోబర్ 13న పోలీసులకు లొంగిపోయాడు.మృతులను జ్యోతి శంకర్ (46), వరుమ్ శంకర్ (20) గౌరీ హంగుడ్ (16), నిశ్చల్ హంగుడ్ (13)గా గుర్తించారు.తొలుత తాను నిర్దోషినని చెప్పిన శంకర్.
తర్వాత గత నెలలో అప్పీల్ను మార్చుకున్నాడు.నిందితుడు తన ఉద్యోగం పోవడంతో నిరాశకు లోనయ్యాడని.
దీనితో పాటు వైవాహిక జీవితంలో కొనసాగేందుకు ఇష్టపడటం లేదని న్యాయవాదులు తెలిపారు.ఈ క్రమంలో హత్యలకు తెగబడినట్లుగా నిర్థారించారు.