మనీలాండరింగ్, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి అంతర్జాతీయ నిఘా సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) కొత్త చీఫ్ గా సింగపూర్ కు చెందిన భారత సంతతి వ్యక్తి టీ.రాజా కుమార్ నియమితులయ్యారు.
ఈ మేరకు ఎఫ్ఏటీఎఫ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఇప్పటి వరకు చీఫ్ గా వున్న డాక్టర్ మార్కస్ ప్లెయర్ స్థానంలో రాజా కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు సేవలందించనున్నారు.గ్లోబల్ యాంటీ మనీలాండరింగ్, కౌంటర్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చర్యల ప్రభావాన్ని పెంచడం, ఆస్తుల రికవరీని మెరుగుపరచడం, ఇతర కార్యక్రమాలపై కుమార్ దృష్టి సారిస్తారని ఎఫ్ఏటీఎఫ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
రాజా కుమార్.నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఎల్ఎల్బీ (ఆనర్స్) డిగ్రీని అందుకున్నారు.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (క్రిమినాలజీ అండ్ లా)ను పూర్తి చేశారు.అలాగే 2006లో హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కు కూడా హాజరయ్యాడు.
దాదాపు 35 సంవత్సరాల పాటు సింగపూర్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ , సింగపూర్ పోలీస్ ఫోర్స్ లో పలు హోదాల్లో కుమార్ విధులు నిర్వర్తించారు.
ప్రస్తుతం ఆయన సింగపూర్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సీనియర్ సలహాదారు (అంతర్జాతీయ)గా పనిచేస్తున్నారు.దీనికి ముందు ఆయన జనవరి 2015 నుంచి 2021 వరకు డిప్యూటీ సెక్రటరీ (అంతర్జాతీయ)గా, 2014 నుంచి 2018 వరకు హోమ్ టీమ్ అకాడమీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు.మాజీ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (పాలసీ), పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, వాణిజ్య వ్యవహారాల శాఖ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ గానూ విధులు నిర్వర్తించారు.సింగపూర్ లో క్యాసినో రెగ్యులేటరీ అథారిటీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు.
ఈ హోదాలో సింగపూర్ లోని కొత్త క్యాసినోల కోసం బలమైన నియంత్రణ ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు