కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్క్ ధరించడం తప్పనిసరి.ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలని నిపుణులు, ప్రభుత్వాలు చెబుతున్నాయి.
వైరస్ ఎటు నుంచి దాడి చేస్తుందో చెప్పలేని పరిస్ధితుల్లో మాస్క్, సోషల్ డిస్టెన్స్ వంటివే ప్రస్తుతం మానవాళికి ఆయుధాలు.అయితే మాస్క్ ధరించడంలోనూ కొందరికి కొన్ని అపోహలు ఉన్నాయి.
ఒకసారి వినియోగించిన మాస్క్ను రెండోసారి ధరించవచ్చా.?, అన్ని రకాల మాస్క్లు వైరస్ను అడ్డుకోగలవా అని మనలో చాలా మందికి అనుమానాలు.
ఈ నేపథ్యంలో కరోనా నుంచి రక్షణ కల్పించే కొత్త రకం పునర్వినియోగ మాస్క్ను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు.ఈ పరిశోధన బృందంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త సుందరేశన్ జయరామన్ కూడా ఉన్నారు.
జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ మాస్క్ను రూపొందించింది.ప్రస్తుతం వినియోగంలో వున్న క్లాత్ మాస్క్ల అంచుల గుండా గాలి లీకవుతోందని జయరామన్ వెల్లడించారు.
ఈ గ్యాప్ నుంచి తుంపర్లు, చిన్నపాటి ఏరోసాల్స్ ద్వారా వైరస్ రేణువులు ముక్కులోకి ప్రవేశించే ప్రమాదం వుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు ఇలాంటి మాస్క్లు ధరిస్తే.వారి నుంచి వైరస్ చాలా తేలిగ్గా ఇతరులకు వ్యాప్తి చెందుతుందని జయరామన్ తెలిపారు.ముఖానికి సరిగా అమరకపోవడం వల్ల తరచుగా ఈ మాస్క్లను సరిచేసుకోవాల్సి వస్తోందని.
దీని వల్ల వేరే ఏదైనా వస్తువులను పట్టుకుని మాస్క్ను సర్దుబాటు చేసుకోవడం వల్ల వైరస్ అంటుకునే ప్రమాదం వుందని ఆయన వెల్లడించారు.ఈ ఇబ్బందులను అధిగమించేలా కొత్త మాస్క్లను తయారు చేశామని.
సాగే లక్షణమున్న వస్త్రాన్ని వడకట్టే పదార్థంతో కలపడం ద్వారా దీనిని రూపొందించినట్లు జయరామన్ తెలిపారు. స్పాండెక్స్, పాలిస్టర్ల మిశ్రమంతో ఈ పునర్వినియోగ మాస్క్ తయారైంది.
ఫలితంగా ఈ మాస్క్ నిర్దిష్ట స్థానంలో స్థిరంగా ఉండటంతో పాటు శ్వాస తీసుకోవడానికి, మాట్లాడటానికి ఇబ్బంది లేకుండా ముక్కు, నోరు ప్రాంతాల్లో కొంత ఖాళీ ఉండేలా రూపొందించారు.తల వెనుక భాగంలో దీని పట్టీలు పటిష్టంగా ఉండటానికి హుక్ , ఐ ఫాస్టనర్స్ను ఏర్పాటు చేశారు.
వినియోగదారుడు తనకు ప్రత్యేక ఫిల్టర్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే ఈ మాస్క్లో ఒక అరను కూడా ఏర్పాటు చేశారు. తేమను పీల్చుకునే స్వభావం కూడా దీనికి ఉంటుంది.
రోజంతా ధరించడానికి ఈ మాస్క్ అనువుగా ఉంటుందట.పరిశోధనలో భాగంగా 20 సార్లు ఉతికినా ఇది పటిష్టంగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.