అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారతీయులకి తన జట్టులో చోటు కల్పిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో ఇండో అమెరికన్కు కీలక బాధ్యతలు అప్పగించారు.ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మలేరియాను రూపు మాపేందుకు గాను ఉద్దేశించిన కార్యదళానికి చీఫ్గా భారత సంతతికి చెందిన రాజ్ పంజాబీని నియమించారు.
ఇవాళ ఉదయం రాజ్ పంజాబీ ప్రమాణ స్వీకారం స్వీకారం చేశారు.ప్రజలకు సేవ చేయడానికి తాను సిద్ధంగా వున్నట్లు రాజ్ ట్వీట్ చేశారు. లైబీరియాలో జన్మించిన రాజ్ పంజాబీ కుటుంబం అంతర్యుద్ధం కారణంగా అక్కడి నుంచి శరణార్ధులగా 1990లో అమెరికాకు వచ్చింది.30 ఏళ్ల క్రితం తాను, తన కుటుంబం శరణార్థులుగా అమెరికాకు వచ్చామని.తమ జీవితాలు మళ్లీ గాడిలో పడటానికి అమెరికన్ సమాజం ఎంతగానో తోడ్పడిందని రాజ్ పంజాబీ నాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు.అలాంటి దేశానికి సేవ చేయడం నిజంగా ఒక గౌరవమన్నారు.
మలేరియా ఈ భూమ్మీద పురాతన, ప్రాణాంతక మహమ్మారిలలో ఒకటని రాజ్ పంజాబ్ చెప్పారు.ఈ మిషన్ తనకు వ్యక్తిగతమైనదని ఆయన అన్నారు.
భారత్లో వున్నప్పుడు తన తాతలు, తల్లిదండ్రులు మలేరియా బారినపడ్డారని రాజ్ గుర్తుచేసుకున్నారు.అంతేకాకుండా లైబీరియాలో చిన్నతనంలో తాను కూడా మలేరియాతో బాధపడ్డానని, ఆఫ్రికాలో వైద్యుడిగా పనిచేస్తున్న సమయంలో ఈ వ్యాధి చాలా మంది ప్రాణాలను బలి తీసుకోవడం చూశానని ఆయన చెప్పారు.మలేరియా నుంచి బయటపడిన వారి తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం చూశానని రాజ్ గుర్తుచేసుకున్నారు.రాజ్ పంజాబీ తొమ్మిదేళ్ల వయసులో అంతర్యుద్ధం కారణంగా లైబీరియా నుంచి పారిపోయి అమెరికాలో శరణార్థి అయ్యాడు. అనంతరం వైద్య విద్యార్ధిగా లైబీరియాలో తిరిగి అడుగుపెట్టాడు. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, బ్రిగ్హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్లో అసోసియేట్ ఫిజిషియన్గా, లాస్ట్ మైల్ హెల్త్ సీఈవో, కో ఫౌండర్గా రాజ్ పంజాబీ పనిచేశారు.
ఈయన సారథ్యంలోని లాస్ట్ మైల్ హెల్త్ బృందం 2013-16 మధ్యకాలంలో పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా మహమ్మారిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది.లైబీరియాలోని జాతీయ ఎబోలా ఆపరేషన్ సెంటర్కు చెందిన 1000 మందికి పైగా ఫ్రంట్లైన్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు ఈ సంస్థ శిక్షణ ఇచ్చింది.
యూఎస్ సెనేట్ ఫారిన్స్ రిలేషన్స్ సబ్కమిటీలో ఎబోలా మహమ్మారిపై రాజ్ పంజాబీ ఓ ప్రజంటేషన్ ఇచ్చారు.ప్రస్తుతం కరోనాను ఎదుర్కొనేందుకు గాను ఆఫ్రికాలోని వివిధ దేశాలకు చెందిన ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు లాస్ట్ మైల్ హెల్త్ శిక్షణ ఇచ్చింది.
నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఇంటర్నల్ ట్రీట్మెంట్, ప్రాథమిక సంరక్షణపై రాజ్ శిక్షణ పొందారు.జాన్స్ హాప్కిన్స్ నుంచి ఎపిడెమియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
అలాగే హార్వర్డ్లోని కెన్నెడీ స్కూల్లో ఫ్యాకల్టీగా పనిచేశాడు.