వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా వలస వెళ్లిన భారతీయులు అక్కడ ఎన్నెన్నో విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే.మొన్నామధ్య ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియామకంతో భారతీయుల సత్తాపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.
ప్రతిష్టాత్మక సంస్థలు భారతీయుల చేతుల్లోకి వస్తూనే వున్నాయి.తాజాగా భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ సౌమిత్రా దత్తాను సైద్ బిజినెస్ స్కూల్ కొత్త డీన్గా నియమిస్తున్నట్లు యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది.
ప్రస్తుతం న్యూయార్క్లోని కార్నెల్ యూనివర్సిటీలో కార్నెల్ ఎస్సీ జాన్సన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో సౌమిత్రా దత్తా ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు.ఈ ఏడాది జూన్ 1న ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తన నియామకంపై సౌమిత్రా దత్తా హర్షం వ్యక్తం చేశారు.తన కుమార్తె సారా ఆక్స్ఫర్డ్ వర్సిటీ నుంచే పట్టభద్రురాలైందని, తనకు తన భార్యకు ఆ వర్సిటీతో అనుబంధం వుందని ఆయన తెలిపారు.
విభిన్నమైన, వినూత్నమైన కమ్యూనిటీలో భాగం కావాలని మేమిద్దరం ఎదురుచూస్తున్నట్లు దత్తా పేర్కొన్నారు. గ్లోబల్ బిజినెస్ స్కూల్ నెట్వర్క్కు చైర్గా, ఫ్రాన్స్లోని INSEADలో 13 ఏళ్ల నాయకత్వ పాత్రలతో పాటు ఆయనకు అకడమిక్ కెరీర్లో మూడు దశాబ్ధాల అనుభవం వుంది.
దీనితో పాటు లిస్టెడ్ ఇంటర్నేషనల్ కార్పోరేషన్ బోర్డులలోనూ దత్తా పనిచేశారు.పలు విజయవంతమైన స్టార్టప్లను స్థాపించడంతో పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ ఆన్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్కు ఆయన కో చైర్గా వున్నారు.
1963 ఆగస్టు 27న పంజాబ్లోని చండీగఢ్లో జన్మించిన సౌమిత్రా దత్తా ఢిల్లీ ఐఐటీ నుంచి బీటెక్ పట్టా పొందారు.కార్నెల్ యూనివర్సిటీలోని ఎస్సీ జాన్సన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్కు తొలి డీన్గా దత్తా రికార్డుల్లోకెక్కారు.2018 జనవరిలో రాజీనామా చేసే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు.2013లో ఆయన స్థాపించిన ఫిష్ ఐ అనలిటిక్స్ను డబ్ల్యూపీపీ గ్రూప్ కొనుగోలు చేసింది.సోడెక్సోకు దత్తా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు.అకడమిక్స్లో ఆయన అందించిన సేవలకు గాను ప్రతిష్టాత్మక ‘‘యూరోపియన్ కేస్ ఆఫ్ ది ఇయర్’’ అవార్డులను నాలుగు సార్లు (1997, 1998, 2000, 2002) అందుకున్నారు.